రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకంగా ఉన్న తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా కొత్త నేతని పెడుతున్నారా? ఐఏఎస్ కోచింగ్ టీచర్గా పనిచేస్తూ…పోలిటికల్ అనలిస్టుగా ఉంటూ..అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కొలికిపూడి శ్రీనివాసరావుని తాడికొండ టిడిపి అభ్యర్ధిగా పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టిడిపి శ్రేణులు. రానున్న ఎన్నికల్లో ఆయనే టిడిపి అభ్యర్ధి అని, ఆశావాహులు ఉంటే సర్దేసుకోవచ్చు అని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అమరావతి ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గం చాలా కీలకమైనది. ఎస్సీ రిజర్వడ్ సీటుగా ఉన్న ఈ ప్రాంతంలో గతంలో టిడిపికి పెద్ద పట్టు ఉండేది కాదు. 1983, 1985, 1999, 2014 ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి గెలిచింది. కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచింది. ఇక రాష్ట్రం విడిపోయాక తాడికొండలో టిడిపి గెలిచింది. అలాగే చంద్రబాబు సిఎం అయ్యాక..తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలని కలిపి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశారు. అక్కడ 33 వేల ఎకరాలు సమీకరించి..అద్భుతమైన రాజధాని నిర్మించే దిశగా ముందుకెళ్లారు.
కానీ 2019 ఎన్నికల్లో ప్రజల ఆలోచన మారింది. అటు అమరావతి ప్రజలు కూడా జగన్ మాటలు నమ్మారు. ఇంకా ఏదో చేస్తారని అనుకున్నారు. వైసీపీని గెలిపించారు. అటు తాడికొండ, ఇటు మంగళగిరిలో వైసీపీ గెలిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బకొట్టి మూడు రాజధానులు అన్నారు. చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.
అయితే వైసీపీపై ఇప్పటికే అమరావతి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ సారి అక్కడ వైసీపీకి డిపాజిట్లు గల్లంతు అవ్వడం ఖాయమే. ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక్కడ టిడిపి గెలుపు లాంఛనమే. అయితే అభ్యర్ధిపై చర్చలు నడుస్తున్నాయి. ఇంచార్జ్ గా తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. కానీ ఈ సారి ఆయనకు సీటు ఇవ్వరనే టాక్ నడుస్తుంది. శ్రావణ్ని బాపట్ల ఎంపీగా పంపి..కొలికిపూడిని తాడికొండ బరిలో నిలబెడతారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.