తెలుగుదేశం పార్టీకి కలిసిరాని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి..మొదట నుంచి ఆ ప్రాంతాల్లో టిడిపికి పట్టు తక్కువే..ముఖ్యంగా రెడ్డి, ఎస్సీ కమ్యూనిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో టిడిపి సత్తా చాటేది కాదు. అలా టిడిపికి కాస్త పట్టు తక్కువ ఉన్న ప్రాంతాల్లో వెస్ట్ ప్రకాశం ప్రాంతం..ఈ పరిధిలో ఉన్న కొన్ని స్థానాల్లో టిడిపి మొదట నుంచి సత్తా చాటేది కాదు. ఏదో అప్పుడప్పుడు గాలి ఉన్నప్పుడే గెలిచేది.
అయితే ఈసారి వెస్ట్ లో సీన్ మారేలా ఉంది. టిడిపి అనూహ్యంగా బలపడుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, టిడిపి నేతలు కష్టపడి పనిచేయడం..ఆ మధ్య చంద్రబాబు టూర్, ఇప్పుడు లోకేష్ పాదయాత్రతో పార్టీకి ఊపు వస్తుంది. తాజాగా లోకేష్..కందుకూరు, కొండపి, కనిగిరి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఆ మూడుస్థానాల్లో టిడిపి బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు మార్కాపురంలోకి ఎంట్రీ ఇచ్చారు.అయితే మార్కాపురం అనేది టిడిపికి కలిసిరాని స్థానం.
1983 పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి చూసుకుంటే..అక్కడ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1983, 2009 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. టిడిపి హవా ఉన్న 1994, 1999, 2014లో కూడా గెలవలేదు. అంటే అక్కడ రెడ్డి వర్గం హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే మొదట కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ కంచుకోటగా ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలుస్తూ వస్తుంది.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నాగార్జున రెడ్డి గెలిచారు. అయితే ఆయన పెద్దగా ఏమి రాణించడం లేదు. కాకపోతే రెడ్డి వర్గం ప్రభావం వల్ల అక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. ఇటు టిడిపి నుంచి కందుల నారాయణ రెడ్డి కూడా కష్టపడుతున్నారు. కానీ ఇటీవల ఆయనకు యాక్సిడెంట్ అయింది..కాలుకు ఫ్రాక్చర్ అయింది..అయినా సరే వీల్ చైర్ తోనే లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రకు టిడిపికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మార్కాపురం ఈ సారైనా టిడిపికి దక్కుతుందేమో.