రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు చేయడం అనేది సహజమే..కానీ అవే చేసేటప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఆరోపణల్లో వాస్తవం ఉండాలి. ఎలా పడితే అలా ఆరోపణలు చేస్తే సరిపోదు. దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై ప్రతిపక్ష టిడిపి నేతలు అనేక ఆరోపణలు చేస్తారు..దాదాపు ఆధారాలకు తగ్గట్టుగానే ప్రభుత్వంపై గాని, వైసీపీ నేతలపై గాని ఆరోపణలు గుప్పిస్తారు.
అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైసీపీ దాదాపు కక్షపూరిత చర్యలకే దిగుతుంది తప్ప..ఆ ఆరోపణలు తప్పు నిరూపించుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. కానీ లోకేష్ అదే పనిలో ఉన్నారు. తనపై గుడ్డిగా ఆరోపణలు చేసే వైసీపీ పెయిడ్ మీడియా, పెయిడ్ ఆర్టిస్టులకు కోర్టుల ద్వారా సరైన సమాధానం ఇస్తున్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉండగా విశాఖ ఎయిర్పోర్టులో లోకేష్ చిరుతిళ్ళకు రూ.25 లక్షలు అయ్యాయని సాక్షి న్యూస్ వేసింది.
2019 అక్టోబర్ 22న సాక్షి దినపత్రికలో ‘చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ సాక్షి మీడియాపై పరువునష్టం దావా దాఖలు చేశారు. సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది.
ఇక ఇటీవల వైసీపీ నేత పోసాని కృష్ణమురళి..గ్రేట్ ఆంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంతేరులో లోకేష్ 14 ఎకరాలు కొన్నారని లేనిపోని ఆరోపణలు చేశారు. దీనిపై లోకేష్ కోర్టుకు వెళ్లారు. కంతేరులో తనకు సెంటు భూమి లేదని, పోసాని క్షమాపణ చెప్పాలని నారా లోకేశ్ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. రెండుసార్లు నోటీసు పంపిన సమాధానం లేదు. దీంతో తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ పోసానిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోర్టుని ఆశ్రయించారు.
అటు ఓ యూట్యూబ్ చానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సింగలూరు శాంతిప్రసాద్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులు ఇచ్చిన లోకేశ్.. ఉద్యోగుల జీతాల నుంచి డబ్బు వసూలు చేయిస్తున్నారని తన ఫ్రెండ్ చెప్పారని ఆయన ఆరోపించారు. దీనిపైనా లోకేశ్ నోటీసులకు వివరణ, క్షమాపణ చెప్పకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇలా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులకు లోకేష్ తనదైన శైలిలో షాక్ ఇస్తున్నారు.