రాయలసీమ టూ గుంటూరు వరకు విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసుకుని .. 19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రకాశం బ్యారేజ్ పై భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు బెజవాడ తమ్ముళ్ళు సిద్ధమయ్యారు. అక్కడ నుంచి విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర జరుగుతుంది.
20వ తేదీన విజయవాడ ఈస్ట్, పెనమలూరు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఇక 21న గన్నవరంలో పాదయాత్ర, భారీ సభ ఉంటుంది..అటు నుంచి 22న నూజివీడు టూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలోకి ఎంట్రీ ఇస్తారు. ఇక కృష్ణాలో పాదయాత్రని సక్సెస్ చేసే బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించారు. మొత్తం ఆయనే పాదయాత్ర బాధ్యతలు చూసుకొనున్నారు. ఇక ఏ నియోజకవర్గంలో అక్కడ ఉండే ఇంచార్జ్ లు ముందుండి నడిపిస్తారు. ఇదే క్రమంలో విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా, ఈస్ట్ లో గద్దె రామ్మోహన్, పెనమలూరులో బోడే ప్రసాద్ చూసుకుంటారు.
ఇక గన్నవరంలో ఇంచార్జ్ లేరు కాబట్టి..జిల్లా నేతలంతా అక్కడ ఫోకస్ పెట్టారు. కానీ విజయవాడ వెస్ట్ ఇప్పుడు చర్చకు వస్తుంది. ఇక్కడ టిడిపి సమన్వయకర్తగా ఎంపీ కేశినేని నాని ఉన్నారు.కానీ ఇటీవల ఆయన యాక్టివ్ గా లేరు. పైగా పాదయాత్ర రూట్ మ్యాప్ అంశంలో ఆయన జోక్యం చేసుకోలేదు.
దీంతో లోకేష్ విజయవాడ ఎంటర్ అయినప్పుడు ఒక ఎంపీగా ఆయన వస్తారా? వెస్ట్ లో లోకేష్ తో కలిసి పాదయాత్ర చేస్తారా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆయన రాకపోతే ..పార్టీకి దూరం జరుగుతున్నారని అర్ధమవుతుంది. ఇదే సమయంలో కేశినేని చిన్నికి బాధ్యతలు ఇవ్వడం ద్వారా..ఆయన్ని నెక్స్ట్ విజయవాడ ఎంపీగా పోటీకి దింపుతారా?అనే చర్చ ఉంది. చూడాలి మరి కేశినేని నాని ఏం చేస్తారో.