వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీలోనే సీట్ల కోసం రచ్చ నడుస్తుంది. ఇక కొందరు ఎమ్మెల్యేలు తీరు నచ్చక సొంత పార్టీ నేతలే ఓడిస్తామని అంటున్నారు. అలాగే సీటు తమదంటే తమదని నేతలు పోటీ పడుతున్నారు. ఒకరికి సీటు ఇచ్చి..మరొకరికి ఇవ్వకపోతే వైసీపీకే నష్టం జరిగేలా ఉంది.
ఇదే క్రమంలో తాజాగా రామచంద్రాపురంలో రచ్చ మొదలైంది. అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్..రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్లకు పడటం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో తన తనయుడుని బరిలో దింపుతానని సుభాష్ ప్రకటించారు. దీంతో చెల్లుబోయిన వర్గంలో టెన్షన్ మొదలైంది. వాస్తవానికి రామచంద్రాపురం సుభాష్ సొంత స్థానం. 1989, 2004, 2009 ఎన్నికల్లో ఆయనే కాంగ్రెస్ నుంచి గెలిచారు. మధ్యలో కొన్ని సార్లు ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వచ్చి 2012 ఉపఎన్నికలో ఓడిపోయారు. 2014లో కూడా ఓడిపోయారు.
ఇక 2019లో తన స్థానాన్ని చెల్లుబోయినకు వదిలారు. అక్కడ చెల్లుబోయిన గెలిచారు. ఇక సుభాష్ మండపేట వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి వచ్చారు. తర్వాత జగన్ మండలి రద్దు అని హడావిడి చేసి సుభాష్ చేత రాజీనామా చేయించి..ఆ మంత్రి పదవిని చెల్లుబోయినకు ఇచ్చారు.
ఇక సుభాష్కు రాజ్యసభ ఇచ్చారు. కానీ ఈ సారి ఎన్నికల్లో తన తనయుడుని నిలబెడతానని అంటున్నారు. దీంతో రచ్చ మొదలైంది. పైగా రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు వర్గం ఉంది. ఆయన ప్రస్తుతం మండపేట వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. కానీ ఆయన ఫోకస్ రామచంద్రాపురంపైనే ఉంది. అక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇలా ఓ వైపు పిల్లి, మరోవైపు తోట వర్గాలతో చెల్లుబోయినకు చెక్ పడేలా ఉంది.