2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రుల్లో నారాయణ కూడా ఒకరు. నారాయణ విద్యాసంస్థల అధిపతి అయిన ఈయన..టిడిపిలోకి వచ్చి..ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అలాగే మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రిగా ఈయన టిడిపిలో నెంబర్ 2 అన్నట్లు దూసుకెళ్లారు. రాజధాని అమరావతి ఏర్పాటులో, అక్కడ రైతుల నుంచి భూములని సమీకరించడంలో సక్సెస్ అయ్యారు.
అనేక కీలక నిర్ణయాల్లో నారాయణ ఉన్నారు. అలాంటి నేత 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు. ఇక ఈయన గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ వేవ్ లో కేవలం 2 వేల ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు. అటు టిడిపి కూడా ఓడిపోవడంతో నారాయణ రాజకీయాల్లో కనిపించలేదు.అయినా నారాయణని వైసీపీ ప్రభుత్వం వదలలేదు. అమరావతి భూముల్లో అక్రమాలు చేశారని, చంద్రబాబుతో పాటు ఈయనపై కేసులు నమోదు చేశారు.
ఇక నారాయణ విద్యాసంస్థల్లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ పై కూడా నారాయణని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇలా అన్నీ రకాలుగా నారాయణని టార్గెట్ చేశారు. అయితే నారాయణ ఇప్పటివరకు రాజకీయాల జోలికి రాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అటు నెల్లూరులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో నారాయణ మళ్ళీ యాక్టివ్ అయ్యారు.
నెల్లూరు సిటీలో లోకేష్ పాదయాత్రని విజయవంతం చేయడమే లక్ష్యంగా పని మొదలుపెట్టారు. అటు సిటీలో ఈ సారి అనిల్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఎలాగో అనిల్ పై వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ వాళ్లే అనిల్ని ఓడించేలా ఉన్నారు..ఆయనకు సీటు విషయమే డౌట్. ఇక నారాయణ పై ఓడిన సానుభూతి ఉంది. అలాగే గతంలో అభివృద్ధి చేశారు. దీంతో ఈ సారి సిటీలో నారాయణ ఖచ్చితంగా గెలిచేలా ఉన్నారు.