ఈ సారి ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం టిడిపి అధినేత చంద్రబాబు మొహమాటం వదిలేశారు. గతంలో మాదిరిగా మొహమాటనికి పోయి బలం లేకపోయిన కొందరికి సీట్లు వచ్చి ఓటమి తెచ్చుకున్నారు. కానీ ఈ సారి అలాంటిది ఉండదని ముందే చెప్పేశారు. సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి వారినైనా పక్కన పెట్టేస్తానని చెప్పేశారు. ఇప్పుడు ఆ దిశగానే బాబు ముందుకెళుతున్నారు. సరిగ్గా పనిచేయని కొందరు మాజీ ఎమ్మెల్యేలని పక్కన పెట్టేస్తున్నారు.
ఆ మధ్య రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ని సైడ్ చేసి ఇంచార్జ్ గా బొడ్డు వెంకటరమణని నియమించారు. తాజాగా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే చిరంజీవులుకు బాబు షాక్ ఇచ్చారు. ఈ నియోజకవర్గ ఇంఛార్జ్గా బోనెల విజయచంద్రను నియమించారు. చిరంజీవులు 2014 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి విజయం సాధించారు. 2019లో జోగారావు చేతిలో ఓడిపోయారు. అయితే ఎమ్మెల్యే జోగారావుపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో చిరంజీవులు విఫలమయ్యారు. దీని వల్ల పార్వతీపురంలో టిడిపికి లీడ్ కనబడటం లేదు.
దీంతో బాబు సడన్ గా చిరంజీవులుని తప్పించి విజయచంద్రని పెట్టారు. బీటెక్ పూర్తిచేసిన విజయచంద్ర కార్పొరేట్ సెక్టార్లో కొన్నేళ్లు పనిచేసి.. తర్వాత వ్యాపారం వైపు మళ్లారు. చిన్నప్పటి నుంచి టీడీపీ అంటే అభిమానమని, పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. అయితే రిజర్వడ్ స్థానమైన పార్వతీపురంలో వైసీపీకి బలం ఎక్కువ.
కానీ వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది. అభివృద్ధి లేదు. కాకపోతే పథకాలు వైసీపీకి ప్లస్. ఇక విజయచంద్ర కాస్త కష్టపడి..ప్రజా మద్దతు పెంచుకుంటే ఈజీగా గెలుస్తారు.