ఈ సారి ఎన్నికల్లో కూడా గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చి..మళ్ళీ గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్త అభ్యర్ధులని పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ముందుకెళుతున్నారు. అలాగే కొంతమంది సీనియర్ నేతలు ఈ సారి తప్పుకుని తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 16 సీట్లకు వైసీపీ 14, టిడిపి 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సీటు ఇస్తారా? అంటే చెప్పడం కష్టమే. కొందరినీ మార్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త అభ్యర్ధులు ఉండే స్థానాల్లో విజయవాడ తూర్పు ఒకటి. ఇది టిడిపి సిట్టింగ్ సీటు..గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి బొప్పన భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు ఆ సీటు కైవసం చేసుకోవడం కోసం దేవినేని అవినాష్ని రంగంలోకి దింపుతున్నారు. ఇటు మాచిలిపట్నంలో ఎమ్మెల్యే పేర్ని నాని ఈ సారి పోటీ చేయడం లేదు. ఆయన తనయుడు కృష్ణమూర్తి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఇక కైకలూరులో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు ఈ సారి సీటు ఇవ్వరనే చర్చ సాగుతుంది. అదే జరిగితే ఇక్కడ కొత్త అభ్యర్ధి వస్తారు.
అటు పెడన సీటుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ మంత్రి జోగి రమేశ్..తన సొంత సీటు మైలవరంపై ఫోకస్ పెట్టారు. దీంతో ఈ రెండు సీట్లలో మార్పులు ఉంటాయేమో చూడాలి. అలాగే పెనమలూరు, అవనిగడ్డ, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేటల్లో ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రమే..కానీ వారు సీనియర్ నేతలు కాబట్టి జగన్ వారిని మార్చే సాహసం చేస్తారా? లేదా? అనేది చూడాలి. ఇక గన్నవరంలో టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీ బరిలో ఉంటారు. ఇక మిగతా సీట్లలో దాదాపు సిట్టింగులే పోటీ చేస్తారు.
ReplyReply allForward |