ఈ సారి ఎన్నికల్లో టిడిపి గెలుపు అనేది చాలా ముఖ్యమనే చెప్పాలి. ఈ సారి అధికారంలోకి రాకపోతే టిడిపి మనుగడకే ప్రమాదం..అందుకే చంద్రబాబు నిత్యం కష్టపడుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అటు లోకేష్ పాదయాత్రతో పార్టీకి మైలేజ్ తెస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు నియోజకవర్గ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేస్తూ ముందుకెళుతున్నారు. అలాగే ఖాళీగా ఉన్న స్థానాలకు ఇంచార్జ్లని పెడుతున్నారు. ఇటీవల కొన్ని స్థానాలకు ఇంచార్జ్లని పెట్టారు.
అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు పరిస్తితి క్లారిటీ రావడం లేదు. ఇక్కడ మొన్నటివరకు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఇంచార్జ్ గా ఉండేవారు. ఈయన సడన్ గా వైసీపీలోకి జంప్ చేశారు. అక్కడ ఎమ్మెల్సీ దక్కింది. దీంతో కైకలూరు టిడిపికి ఇంచార్జ్ లేరు. ఇంచార్జ్ పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే బాబు బలమైన నేతని పెట్టాలని చూస్తున్నారు. ఇటు సీనియర్ నేత పిన్నమనేని వెంకటేశ్వరరావు కైకలూరు కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గుడివాడకు పరిమితమయ్యారు.
గతంలో ఈయన కాంగ్రెస్ లో ముదినేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే మంత్రిగా చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ముదినేపల్లి..కైకలూరు అయింది. దీంతో పిన్నమనేని గుడివాడకు వచ్చారు. కానీ గుడివాడ టిడిపిలో పోటీ ఎక్కువ ఉంది. దీంతో మళ్ళీ కైకలూరు వెళ్లాలని చూస్తున్నారు. అటు ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుని సైతం కైకలూరు పంపే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇటు గుడివాడకు చెందిన పిన్నమనేని బాబ్జీ సైతం కైకలూరుపై ఫోకస్ పెట్టారు. ఇలా కైకలూరు సీటు కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే జనసేనతో పొత్తు ఉంటే ఆ సీటు టిడిపి వదులుకోవాల్సిందే అని తేలుతుంది. చూడాలి మరి కైకలూరు ఇంచార్జ్ గా ఎవరిని పెడతారో.