ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు చాలా సీట్లలో అభ్యర్ధుల విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు క్లారిటీగానే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే దాదాపు 10 సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అని చెప్పవచ్చు. కానీ బాబుని ఎక్కువ ఇబ్బంది పెడుతున్న సీట్లు నంద్యాల, ఆళ్లగడ్డ..ఈ సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో క్లారిటీ రావడం లేదు. మామూలుగా ఈ రెండు సీట్లు భూమా ఫ్యామిలీ అడ్డాలు.
కానీ గత ఎన్నికల్లో రెండుచోట్ల టిడిపి ఓడిపోయింది. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ పోటీ చేసి ఓడిపోయారు, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక తమ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. కాకపోతే అఖిలప్రియతోనే చిక్కులు వచ్చాయి. ఆమె ఆళ్లగడ్డతో పాటు నంద్యాలపై కూడా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఆళ్లగడ్డలో తాను పోటీ చేసి..నంద్యాల సీటు తన సొంత తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి ఇప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. బ్రహ్మానందరెడ్డిని సైడ్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది.
ఇదే క్రమంలో అసలు అఖిల సీటుకే ఎసరు వస్తుందనే ప్రచారం ఉంది. ఆళ్లగడ్డ సీటు భూమా ఫ్యామిలీకి చెందిన కిషోర్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం ఉంది. ఆయన ప్రస్తుతం బిజేపిలో ఉన్నారు. దీంతో అసలు రెండు సీట్లలో క్లారిటీ లేదు. ఈ క్రమంలో చంద్రబాబు ఈ సీట్ల విషయంలో ఏం చేస్తారు..భూమా ఫ్యామిలీకి సీట్లు ఎలా సెట్ చేస్తారు. అసలు ఎవరికి సీట్లు ఇస్తారనేది అర్ధం కాకుండా ఉంది.
అయితే భూమా ఫ్యామిలీ కలిసి లేకపోవడం వల్ల టిడిపికి ఇబ్బందిగా మారింది. నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాల్లో వైసీపీనే బలంగా కనిపిస్తుంది. భూమా ఫ్యామిలీ కలిసికట్టుగా పనిచేస్తే బెటర్. మరి బాబు సీట్లు ఎవరికి ఇస్తారో చూడాలి.