రానున్న ఎన్నికల్లో టిడిపికి చాలా కీలకమైనవి. చావో రేవో లాంటివి. అందుకే పార్టీ గెలుపు కోసం చంద్రబాబు, లోకేష్ కష్టపడుతున్నారు. ఇప్పటికే పార్టీకి మైలేజ్ తీసుకొచ్చారు. గెలుపు దిశగా తీసుకొచ్చారు. అయితే పార్టీ గెలుపు అవకాశాలు ఉండటంతో సీట్ల కోసం పోటీ నెలకొంది. ముఖ్యంగా గెలిచే సీట్లలో నేతల మధ్య పోటీ ఉంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెడన సీటు కోసం పోటీ నెలకొంది.
ఇక్కడ టిడిపి ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్ తో పాటు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఆ మధ్య పెడన సీటు తనకే ఇస్తారని బూరగడ్డ ప్రకటించారు. వాస్తవానికి పెడన మొదట నుంచి కాగిత ఫ్యామిలీదే. మొన్నటివరకు దివంగత కాగిత వెంకట్రావు పోటీ చేస్తే..గత ఎన్నికల్లో ఆయన తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు. పార్టీలో పదవులు దక్కినా , లేకపోయినా కాగిత ఫ్యామిలీ టిడిపి కోసం పనిచేస్తూనే ఉంది. అందుకే కాగితకే సీటు ఇవ్వాలని పెడన టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
పైగా బూరగడ్డపై కాగిత వర్గం ఫైర్ అవుతుంది. ముందు కాంగ్రెస్, తర్వాత ప్రజారాజ్యం, వైసీపీలు మారుకుంటూ టిడిపిలోకి వచ్చిన బూరగడ్డకు సీటు ఎలా దక్కుతుందని ప్రశ్నిస్తున్నారు. పైగా రేపో అటు ఇటు అయినా బూరగడ్డ వేరే పార్టీలోకి జంప్ అయినా అవుతారని, కానీ కాగిత ఫ్యామిలీ అలా కాదని, జీవితాంతం టిడిపిలోనే ఉంటుందని చెబుతున్నారు. అటు కొనకళ్ళ ఫ్యామిలీ బందరు వదిలేసి కావాలని పెడనపై ఫోకస్ పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా పెడన సీటు కాగితకే అని, గెలిచేది ఆయనే అంటున్నారు. మరి బాబు చివరికి ఎవరికి సీటు ఇస్తారో చూడాలి.