మళ్ళీ ఏపీలో ముందస్తు ఎన్నికల గోల మొదలైంది. అంటే ఈ ప్రచారం వైసీపీ కావాలనే చేయిస్తుందా? లేక ప్రతిపక్షాలని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తుందా? నిజంగానే ముందస్తు ఎన్నికలకు వెళుతుందా? అనేది క్లారిటీ లేదు. జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ముందస్తు ఎన్నికలపై ప్రచారం వస్తుంది. అయితే ముందస్తు గురించి ఎప్పటినుంచో టిడిపి చెబుతూనే ఉంది. కానీ ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని వైసీపీ నేతలు చెబుతూ వచ్చేవారు. ఇలా ముందస్తుపై రచ్చ జరిగేది. కానీ ఈ సారి జగన్ ఢిల్లీకి వెళ్ళగానే వైసీపీ అనుకూల మీడియాలో ముందస్తు కథనాలు వచ్చాయి.
ఆఖరికి వైసీపీ అనుకూల జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దీని బట్టి చూస్తుంటే జగన్ ముందస్తుకు వెళ్లడానికే రెడీగా ఉన్నారని అంటున్నారు. కానీ వైసీపీ నేతలు యథావిధిగానే ముందస్తుకు వెళ్ళడం లేదని, ఐదేళ్ల పాటు పాలిస్తామని అంటున్నారు. కానీ వారి మాటలు నమ్మడానికి లేదు. జగన్ ముందస్తుపైనే కేంద్రంలోని పెద్దలతో చర్చించారని తెలిసింది. మొదట అమిత్ షాని కలిశారు. తర్వాత మోదీతో భేటీ అయ్యారు. చివరిలో నిధుల కోసం నిర్మలా సీతారామన్ ని కలిశారు.
అయితే మోదీ, షాలతో ముందస్తు గురించి మాట్లాడారని తెలిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే ఏపీ ఎన్నికలు కూడా జరపాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఎందుకంటే 2024 వరకు ప్రభుత్వాన్ని నడపటం కష్టం…నిధుల కొరత, అటు ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అయితే జగన్ ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళిన గెలుపు డౌటే అంటున్నారు.