వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు రానున్న ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ లో పోటీ చేయనున్నారా? టిడిపి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారా? ఇటీవల వస్తున్న కథనాలు బట్టి చూస్తే రాజుగారు రాజమండ్రి బరిలోనే దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచిన రఘురామ..తర్వాత వైసీపీకి దూరమై..వైసీపీని ఎలా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో తెలిసిందే.
ఇక ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజేపిలో పోటీ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో రఘురామ మళ్ళీ నరసాపురం బరిలో కాకుండా రాజమండ్రి పార్లమెంట్ లో పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది. ఎలాగో అక్కడ టిడిపికి అభ్యర్ధి లేరు. దీంతో ఆయన అక్కడే పోటీ చేస్తారని అంటున్నారు. అటు జనసేన మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. పొత్తులో భాగంగా నరసాపురం సీటు జనసేనకు దక్కుతుందని, అక్కడ నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం ఉంది.
అందుకే రఘురామ రాజమండ్రికి వస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇక్కడ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఉన్నారు. ఈయనతో రఘురామకు పెద్దగా పడని సంగతి తెలిసిందే. ఇక్కడే పోటీ చేసి భరత్కు చెక్ పెట్టాలని రఘురామ చూస్తున్నారట. అయితే టిడిపి-జనసేన పొత్తు ఉంటే ఇక్కడ రఘురామ గెలుపు సులువే.
గత ఎన్నికల్లో టిడిపిపై భరత్ లక్షా 21 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే..జనసేనకు లక్షా 55 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పడుతుంది. ఇక భరత్, రఘురామ మధ్య ఆసక్తికర పోరు జరుగుతుంది. కాకపోతే భరత్ ఈ సారి ఎంపీగా కాకుండా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారనే ప్రచారం ఉంది. చూడాలి మరి భరత్, రఘురామ ప్రత్యర్ధులుగా తలబడతారో లేదో