వైసీపీ అధినేత జగన్ని ముఖ్యమంత్రిని చేయడంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్దే ముఖ్యమైన హ్యాండ్ అనేది కాదనలేని వాస్తవం. ఆయన రచించిన వ్యూహాలు.. సామాజిక వర్గాల మధ్య చిచ్చు, అధికార టీడీపీపై అబద్ధాల ప్రచారంతో జగన్ని ఎలివేట్ చేసి, జాకీలు వేసి చివరకి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. జగన్ ముఖ్యమంత్రి కావడంలో ప్రశాంత్ కిషోర్ నడిపిన మంత్రాంగం అంతా ఇంతా కాదు.. చివరికి కోడికత్తి లాంటి డ్రామాలని కూడా నడిపారనే చర్చ ఉంది.. ఇటు సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యను ప్రత్యర్ధి పార్టీలకు అంటగట్టేలా ప్రచారం చేయడంలోనూ ప్రశాంత్ కిషోర్ మాస్టర్ బ్రెయిన్ ఉందనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి..
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రూట్ మార్చారు. పీకే ఇస్తున్న సలహాలు, సూచనలు పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ.. రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో.. ఆ తర్వాత ఎన్నికల్లో.. మళ్లీ మళ్లీ తానే గెలవాలనే అత్యాశతో రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలు గాలికొదిలేసి.. ప్రజలకు డబ్బు పంచడమే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం అన్నట్టు వ్యవహరించారు. చంద్రబాబుకు పేరు రాకూడదనే ఒకే ఒక్క కారణంతో అమరావతిని చంపేసి.. మూడు రాజధానుల పేరుతో రాజకీయాలు చేసి.. రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. వెంటపడి పరిశ్రమలు తీసుకురావాల్సింది పోయి.. పారిశ్రామికవేత్తలను వెంటపడి వెంటపడి తరిమేశారు. ఫలితం.. నాలుగున్నరేళ్ల జగన్ సర్కారు పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయింది. ప్రభుత్వ రుణాలు అన్ని పరిమితులు దాటిపోయి.. కొత్తగా అప్పులు పుట్టడమూ కష్టమే అన్నట్లు తయారైంది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి.
జగన్ తన సలహాలు పాటించడం లేదని ఫీలయ్యారో లేక.. ఆంధ్రప్రదేశ్ దుస్థితికి తానే ప్రధాన కారణమని భావించారో తెలియదు కానీ.. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బరస్ట్ అయ్యారు ప్రశాంత్ కిషోర్. సంక్షేమ పథకాల పేరుతో జనాలకు డబ్బులు పంచి పెట్టడం గురించి అడిగిన ప్రశ్నకు.. వైసీపీ నేతలందరికీ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు పీకే. సంక్షేమాన్ని పూర్తిగా వదిలేస్తే సమాజానికి అన్యాయం చేసిన వాళ్లమవుతాం అని చెబుతూనే.. సంపాదిస్తేనే పంచిపెట్టగలమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న వాళ్లు అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని.. అప్పుడే సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చే పరిస్థితి ఉంటుందని వివరించారు. డెవలప్మెంట్ లేకుండా.. పథకాలు పెంచుకుంటూ.. ఇష్టమొచ్చినట్టు పంచుకుంటూ పోతే.. ఖజానా ఖాళీ అవ్వడంతో పాటు.. నిరంతరంగా అప్పులు చేస్తూ పోవాల్సి వస్తుందని.. ఇందుకు ఆంధ్రప్రదేశ్నే ఉదాహరణగా చూపించారు.
బీహార్లో నితీష్కుమార్ నుంచి తమిళనాడులో ఎంకే స్టాలిన్ వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులకు ఆ సీటు సాధించిపెట్టడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలదే ప్రధాన పాత్ర అని చెప్పడం అతిశయోక్తి కాదు. అయితే వాళ్లెవరి విషయంలోనూ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదాయన. ఈ మధ్య కాలంలో పీకే చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. సీఎం జగన్కు ఆ పదవి కట్టబెట్టి చాలా పెద్ద తప్పు చేశానా అనే ఆవేదనలో ఉన్నారేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ను నాశనం చేశానని ప్రశాంత్ కిశోర్ పశ్చాత్తాప పడుతున్నారని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అపరిమిత వనరులు, లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజల అండదండలున్న రాజకీయ పార్టీలనే బొల్తా కొట్టించిన గొప్ప ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. జగన్ విషయంలో ఎలా తప్పు చేశారు.. మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది పొలిటికల్ పండితులకూ ఆర్ధం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది.