టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా పార్టీ ఈ రేంజ్లో వ్యూహాలు వేసిన ఎన్నికలు మరొకటి లేవని అంటున్నారు పార్టీ సీనియర్లు. 1982లో పార్టీ స్తాపించిన తర్వాత.. అనేక మంది ప్రతిపక్ష నాయకులను, అధికార పార్టీలను ఎదుర్కొని పార్టీ రాటు దేలింది. ముఖ్యంగా వైఎస్ వంటి బలమైన నాయకుడిని 2009 ఎన్నికల్లో కొన్ని స్థానాలకే పరిమితం చేసింది. అలాంటి పార్టీ ఇప్పుడు అంతకు మించి.. అన్నట్టు ఒకరకంగా చెప్పాలంటే.. టీడీపీ చరిత్రలోనే తొలిసారి.. చంద్రబాబు రోజుకొక వ్యూహంతో తెరమీదికి వస్తున్నారు.
మహాభారతంలో అర్జనుడికి పక్షికన్ను మాత్రమే కనిపించినట్టుగా.. చంద్రబాబుకు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో విజయమే కనిపిస్తోందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ విజయ లక్ష్యం సాధించేందుకు ఉన్న అన్ని ఆయుధాలను ఆయన వినిగిస్తున్నారు. ఇక, ఇప్పుడు రోజుకొక కొత్త ఆయుధాన్ని కూడా తెరమీదికి తెస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబు.. తాజాగా `నారీశక్తి` పేరుతో మరో కార్యక్రమానికి ప్రాణం పోశారు.
ఈ నారీ శక్తి యాత్ర ద్వారా.. పార్టీలోని మహిళా కార్యకర్తలు ఇక, విజృంభించనున్నారని నాయకులు చెబుతు న్నారు. ప్రతి జిల్లాకు ఒక బస్సును కేటాయించనున్నారు. ఆ జిల్లాలోని కీలకమైన మహిళా నాయకులకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీరంతా ఉదయాన్నే ఆయా జిల్లాల్లోని మండలాల స్థాయికి వెళ్లి.. మహిళలను మోటివేట్ చేయనున్నారు. టీడీపీ హయాంలో ఎంత లబ్ధి పొందారో.. ఇప్పుడు ఏం జరుగుతోందో వివరించనున్నారు.
అదే సమయంలో మహానాడు వేదికగా.. ప్రకటించిన మినీ మేనిఫెస్టోను కూడా మహిళలకు వివరించనున్నారు. తద్వారా కీలకమైన మహిళా ఓటు బ్యాంకును ఒడిసి పట్టుకునే వ్యూహాన్ని చంద్రబాబు సిద్ధం చేశారు. ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట పల్లెనిద్రకు తాను సమాయత్తం అవుతున్నట్టు బాబు ప్రకటించారు. దానికంటే ముందు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులని అబు సందర్శించనున్నారు.
ఇప్పటికే గత టిడిపి హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరగడం, భారీగా నిధులు ఖర్చు పెట్టడం గురించి, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేయడంపై చంద్రబాబు మూడు రోజుల నుంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక ఆగష్టు 1నుంచి సాగునీటి ప్రాజెక్టులని సందర్శించనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుందని, 3న గండికోట రిజర్వాయర్ పరిశీలన తర్వాత అనంతపురం జిల్లాకు చంద్రబాబు వస్తారని, 4న కళ్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్లో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
మరోవైపు.. యువగళం సాగుతోంది. ఇంకోవైపు.. భరోసా పేరుతో బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ఎన్నికలకు ఎనిమిది మాసాల ముందే.. ఇన్ని ఆయుధాలను చంద్రబాబు ప్రయోగించారు. మరిన్ని ఆయుధాలు ఉన్నాయని.. తక్కువగా అంచనా వేయొద్దని.. పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ దడదడలాతుండడం గమనార్హం అని పార్టీ నాయకులు చెబుతుండడం విశేషం.