రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా మారింది. కావాలని చేస్తున్నారో లేక…నార్మల్ గానే రాజకీయం నడుస్తుందో క్లారిటీ లేదు గాని ఇటీవల వైసీపీ వర్సెస్ పవన్ అన్నట్లు రాజకీయం నడుస్తుంది. పవన్ అనూహ్యంగా వాలంటీర్ వ్యవస్థని టార్గెట్ చేయడం..అటు వైసీపీ రివర్ అయ్యి పవన్ని యథావిధిగానే తిట్టడం, అటు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడంతో రాజకీయ పోరు మారిపోయింది. అటు వైసీపీకి పోటీగా జనసేన శ్రేణులు నిరసనలు తెలియజేస్తున్నాయి.
దీంతో రాజకీయం మొత్తం వైసీపీ-జనసేనల మధ్య నడుస్తున్నట్లు మీడియా చూపిస్తుంది. ఈ పోరులో టిడిపి పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. కానీ టిడిపి చేయాల్సిన పనులని సైలెంట్ గా చేసేస్తుంది. ఒకటి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం,రెండు టిడిపి మినీ మేనిఫెస్టోని ప్రచారం చేయడం, మూడు టిడిపిని బలోపేతం చేసుకోవడం..ఈ పనులు టిడిపి సైలెంట్ గా చేసేస్తుంది. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టిడిపి నేతలు ప్రతి నియోజకవర్గంలో బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అటు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో దూసుకెళుతున్నారు.
ఇటు చంద్రబాబు ఏమో ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ..నియోజకవర్గాల వారీగా పార్టీని బలపడేలా చేస్తున్నారు. దీంతో టిడిపి అనూహ్యంగా ప్రజల్లో బలం పెంచుకుంటుంది. అయితే త్వరలోనే బాబు ప్రజల్లోకి రానున్నారు. ఇప్పటికే పలుమార్లు జిల్లాల పర్యటనకు వెళ్ళి..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ఇక త్వరలోనే బాబు ప్రజల్లోకి వచ్చి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అలాగే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లపై క్లారిటీ ఇవ్వాలి…అదేవిధంగా ఫుల్ మేనిఫెస్టో..అభ్యర్ధులపై కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి టిడిపి సైలెంట్ గా వైసీపీకి దెబ్బ వేస్తుంది.