ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి ఎవరో క్లారిటీ వచ్చేసింది..మాజీ ఎమ్మెల్యే, ఇంచార్జ్ తంగిరాల సౌమ్యకే సీటు అని టిడిపి అధినేత చంద్రబాబు డిక్లేర్ చేశారు. దీంతో నందిగామలో ఈ సారి పోరు హాట్ హాట్ గా జరగనుంది. తాజాగా సౌమ్య, నందిగామ టిడిపి నేతలతో కలిసి బాబుని కలిశారు. నియోజకవర్గంలో పరిస్తితులని వివరించారు. చేస్తున్న కార్యక్రమాలని చెప్పారు.
అటు పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారం మండలాల వారీగా పార్టీ బలాబలాలను చంద్రబాబు వివరించారు. పలుచోట్ల ఉన్న లోపాలను కూడా చెప్పారు. ఇంకా కొన్ని వర్గాలు పార్టీకి దూరంగా ఉన్నాయని, వారంతా చేరవయ్యేలా చూడాలని, నందిగామలో పార్టీ బలంగానే ఉందని, గెలుపు తథ్యమని చంద్రబాబు అన్నారు. ఇక వినయం, విధేయతే ప్రామాణికంగా సౌమ్యకు టికెట్ ఇస్తున్నానని, సౌమ్య తండ్రి తంగిరాల ప్రభాకరరావుకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, ఇక ఆమె చేస్తున్న పోరాటాలు పరిగణనలోకి తీసుకుని నందిగామ టికెట్ కేటాయిస్తున్నామని అన్నారు. ఆర్థిక స్థోమత లేకున్నా నందిగామ అభ్యర్ధి సౌమ్య అని ప్రకటించారు. అంకిత భావం ఉన్న వ్యక్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
అయితే మొన్నటివరకు టిడిపి సీటుపై గందరగోళం ఉంది..ఇప్పుడు తేల్చేశారు. ఇక నందిగామలో టిడిపి గెలుపుకు సానుకూల అంశాలు ఉన్నాయి. అసలు నందిగామ టిడిపి కంచుకోట. ఇక్కడ టిడిపి 7 సార్లు గెలిచింది. 2014లో టిడిపి నుంచి తంగిరాల ప్రభాకరరావు గెలిచారు..తర్వాత ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఉపఎన్నికలో సౌమ్య పోటీ చేసి గెలిచారు. 2019లో ఆమె ఓటమి పాలయ్యారు.
వైసీపీ నుంచి మొండితోక జగన్ మోహన్ రావు గెలిచారు..ఈయన ఇప్పుడు పెద్దగా పాజిటివ్ లేదు. పైగా ఈయన సోదరుడు అక్రమాలు ఎక్కువ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి..ఇసుక, ఇళ్ల స్థలాలు, మైనింగ్ లాంటివి ఉన్నాయని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఈ సారి కంచుకోటని టిడిపి తిరిగి చేజిక్కించుకునే ఛాన్స్ ఉంది.