ఎన్నికల సమయంలో హడావిడిగా అభ్యర్ధులని ప్రకటించడం కంటే..ముందే ప్రకటించడం వల్ల పార్టీలో విభేదాలు వచ్చిన సర్దుకోవచ్చు..అలాగే నేతల బలం కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు..ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం..అలాగే బలంగా ఉన్న చోట అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇదే సమయంలో డోన్ నియోజకవర్గంలో అభ్యర్ధిగా ఎం.సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశారు. గతేడాది డోన్ అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించారు. దీంతో సుబ్బారెడ్డి డోన్ లో దూకుడుగా పనిచేస్తూ వస్తున్నారు. ఈ సారి డోన్ లో పసుపు జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే డోన్ వైసీపీకి కంచుకోటగా ఉంది. అందులోనూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అడ్డాగా మారిపోయింది. గత రెండు ఎన్నికల్లో బుగ్గన డోన్ నుంచి గెలిచారు. టిడిపి నుంచి కేఈ ప్రతాప్ ఓడిపోతూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రెస్ లేరు.
దీంతో కేఈ ఫ్యామిలీ నుంచి ప్రభాకర్ని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన కూడా ఎఫెక్టివ్ గా పనిచేయలేదు. టిడిపి బలం పెంచలేదు. దీంతో బాబు ఆయన్ని సైడ్ చేశారు. సుబ్బారెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. ఇంచార్జ్ గా వచ్చిన దగ్గర నుంచి సుబ్బారెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ని అభ్యర్ధిగా ఫిక్స్ చేశారు. అక్కడ నుంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు.
ఇప్పుడు బుగ్గనతో ఢీ అంటే ఢీ అనేలా సుబ్బారెడ్డి పనిచేస్తున్నారు..కానీ డోన్ లో రెడ్డి వర్గం హవా ఎక్కువ. దీని వల్ల టిడిపికి పట్టు దొరకడం ఈజీ కాదు. కాకపోతే బిసి వర్గాన్ని ఇంకా ఎక్కువ ఆకట్టుకుని రెడ్డి వర్గం ఓట్లు 30 శాతం పైనే దక్కిన చాలు. డోన్ లో టిడిపి గెలుస్తుంది. ఆ దిశగా సుబ్బారెడ్డి పనిచేస్తే..డోన్ లో బుగ్గనకు చెక్ పెట్టవచ్చు.