ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గెలుపుపై ఆశలు ఉన్న సీట్లలో ప్రొద్దుటూరు కూడా ఒకటి. ఈ సారి ఇక్కడ గెలవాలని పట్టుదలతో టిడిపి ఉంది. ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలుస్తూ వచ్చిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. పైగా సొంత పార్టీ నేతలతో విభేదాలు ఉన్నాయి. ఈ పరిస్తితులు వైసీపీకి మైనస్.
ఇక్కడ టిడిపి బలపడుతుంది గాని అభ్యర్ధి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇంచార్జ్ గా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులు రెడ్డి సైతం సీటు కోసం పోటీ పడుతున్నారు. వరదరాజులు.1985లో టిడిపి నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళి 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. 2009లో టిడిపి నుంచి లింగారెడ్డి గెలిచారు. 2014లో వరదరాజులు టిడిపి నుంచి పోటీ చేసి, రాచమల్లుపై ఓడిపోయారు. 2019లో టిడిపి నుంచి లింగారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు ఇంచార్జ్ ప్రవీణ్ పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ లింగారెడ్డి, వరదరాజులు సైతం సీటు ఆశిస్తున్నారు. దీంతో ప్రొద్దుటూరు సీటు ఎవరికి దక్కుతుందనే చర్చ వస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ప్రవీణ్కు సీటు దక్కుతుందనే ప్రచారం ఉంది. ప్రవీణ్ కు సీటు దక్కితే లింగారెడ్డి, వరదరాజులు ఎంతవరకు సహకరిస్తారో చెప్పలేం.వారికి కూడా ప్రొద్దుటూరులో సొంత వర్గాలు ఉన్నాయి. వారి మద్ధతు లేకపోతే టిడిపికి ఇబ్బందే. మరి ఇవన్నీ బేరీజు వేసుకుని చంద్రబాబు సీటు ఎవరికి ఇస్తారు. ఒకరికి సీటు ఇచ్చిన మిగతా వాళ్ళు సహకరించేలా చేసుకుంటూనే ప్రొద్దుటూరులో గెలుపు సాధ్యం.