రాజకీయాల్లో ఏ పార్టీలో నైనా అధినేత చెప్పిందే ఫైనల్…అధినేత తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి..అయితే అధినేత నేత ఎప్పుడైనా ప్రతి నిర్ణయం ఆచి తూచి తీసుకుంటారు. ఒకోసారి కొందరు నేతలు త్యాగాలు చేయక తప్పదు..అలా కాకుండా రివర్స్ లో గళం విప్పడం వల్ల అది పార్టీకే నష్టం చేస్తుంది. ఇప్పుడు సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ వారసుడు శివరాం వల్ల అదే జరుగుతుందా? అనే డౌట్ టిడిపి శ్రేణుల్లో ఉంది.
కోడెల టిడిపి కోసం ఎంత కష్టపడ్డారో..పల్నాడులో పార్టీని ఎలా నిలబెట్టారో కూడా తెలుసు. అలాగే అధికార వైసీపీ కుట్రలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే కోడెల చనిపోయాక సత్తెనపల్లి సీటు విషయంలో పెద్ద రచ్చ నడిచింది. సీటు కోసం చాలామంది పోటీపడ్డారు. చివరికి చంద్రబాబు…బిజేపి నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణని సత్తెనపల్లి ఇంచార్జ్ గా పెట్టారు.
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు చెక్ పెట్టడానికే కన్నాని రంగంలోకి దింపారు. అయితే తనకు సీటు ఇవ్వకపోవడంపై కోడెల వారసుడు ఫైర్ అవుతున్నారు. అక్కడ ఆయన ఒంటరిగా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా కోడెల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఒంటరి వాడిని చేసి చుట్టుముట్టి ఎన్నో కుట్రలు చేస్తున్నారని, పదవుల కోసం అధికారం కోసం పార్టీలు మారే కుటుంబం తమది కాదని చెబుతూనే… కోడెల శివప్రసాదరావు స్థానంలో వేరే వారిని తీసుకొచ్చారని వాపోయారు.
అలా తీసుకొచ్చిన వారి వెంట తనను నడవమన్నారని.. కానీ తాను నడవనని, పల్నాటి పులి కోడెలతో నడచిన తాను పిల్లుల పక్కన నడిచేది లేదని చెప్పుకొచ్చారు. అంటే కన్నాకు కోడెల సపోర్ట్ ఇవ్వనని అంటున్నారు. ఇలా చేయడం వల్ల కోడెల వర్గం..కన్నాకు అపోజిట్ గా ఉంటే..మళ్ళీ ఓట్ల చీలిక వస్తుంది. అప్పుడు టిడిపికే నష్టం..కాబట్టి ఈ సమస్యని చంద్రబాబు త్వరగా పరిష్కరిస్తే బెటర్.