రాష్ట్రంలోని యువత రగిలిపోతున్నారు. తమకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రి జగన్కు నివాళులర్పించే పరిస్థితికి వచ్చారు. మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? తప్పెవరిది? వచ్చే ఎన్నికల్లో ఓటమి భయమో.. గెలవలేరనో ఆందోళనతోనో ఎమ్మె ల్యే అభ్యర్థులను మార్చేస్తున్న వైసీపీ అధినేత జగన్ దీనికి సమాధానం చెప్పగలరా? అనేది వైసీపీ అంతర్గత చర్చ.
వచ్చే ఎన్నికల్లో గెలవలేరనే కారణంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం.. వారికి ప్రజాదరణ, జనాదరణ లేదనే! అయితే.. అసలు.. ప్రభుత్వం పరంగా అధినేత, సీఎం సరిగా వ్యవహరిస్తే..తమకు ఈ తిప్పలు ఉంటాయా? అనేది మౌనంగా ఉండి రగిలిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన. 2019 ఎన్నికలకు ముందు డీఎస్సీ వేస్తామని చెప్పారు. ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ ఇస్తామని.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ఈ హామీని ఊరూ వాడా ప్రచారం చేశారు. నేను ఉన్నాను.. నేను విన్నాను.. అని పదే పదే చెప్పుకొచ్చారు. ఇంకే ముంది మన ప్రభుత్వం రాగానే మార్పులు తెస్తామన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో జరిగింది ఏమిటి? జగన్ అధికారంలోకి అయితే వచ్చారు. కానీ, ఇచ్చిన హామీలు మాత్రం గాలికి పోయాయి. మెగా డీఎస్సీ వేయనేలేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఊసే లేదు. ఇక, జాబ్ క్యాలెండర్ అన్న మాట ఎప్పుడో మరిచిపోయారు. ఈ ఏడాది జనవరిలో ఒక క్యాలెండర్ను ప్రకటించి కూడా వెనక్కి తీసుకున్నా రు.
ఇక, ఎన్నికలకు ముందు కూడా డీఎస్సీ మాటే ఎత్తడం లేదు. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా యువతరగిలి పోతున్నారు. ఫలితంగా వైసీపీ నేతలకు ఎమ్మెల్యేలకు భారీ సెగ తగులుతోంది. ఈ పాపం వాస్తవానికి ఎమ్మెల్యేలదా? నేతలదా? జాబ్ క్యాలండర్ ఇస్తే.. వద్దన్న ఎమ్మెల్యేలు ఉన్నారా? జాబులు ఇస్తామంటే అడ్డుపడ్డ నేతలు ఉన్నారా? కానీ, ఈ విషయాన్ని గుర్తించకుండా.. నేతలపై నెపం నెట్టి.. అధినేత మాత్రం తప్పించుకునేందుకు ప్రయత్నాలు చే్స్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఇటీవల ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్ జగన్కు వినిపించిందో లేదో కానీ.. వైసీపీ నాయకులు మాత్రం బాగానే గుర్తు పెట్టుకున్నారు.