ఉత్తరాంధ్ర అంటే టిడిపికి పట్టున్న ప్రాంతంలో అందులో విశాఖ అంటే టిడిపికి కంచుకోట. అలాంటి కంచుకోటలో గత ఎన్నికల్లో టిడిపిని దెబ్బకొట్టి వైసీపీ సత్తా చాటింది. విశాఖలో పైచేయి సాధించింది. ఇలా వైసీపీ విజయం సాధించడం వెనుక కారణం జగన్ గాలి, విజయసాయిరెడ్డి కష్టం ఉందని చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డిని సైడ్ చేసి వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రపై పెత్తనం ఇచ్చారో అప్పటినుంచి..అక్కడ వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
విశాఖని పరిపాలన రాజధాని అని చెప్పిన కూడా అక్కడి ప్రజలు వైసీపీని నమ్మడం లేదు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా వైసీపీ ఓడిపోయింది. ఇదే క్రమంలో వైవీ చేసే రాజకీయం వైసీపీకి ఇంకా నష్టం చేస్తుంది. ఇటీవల వైవీ తాను సొంతంగా అభ్యర్ధులని ప్రకటించుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ మధ్య ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు మళ్ళీ పోటీ చేస్తారని అన్నారు. అసలే ఆయనపై పీకల్లోతు వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ వాళ్ళే ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఇలాంటి సమయంలో కన్నబాబురాజుకే సీటు అని ప్రకటించారు. ఇటు పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ పై కూడా వ్యతిరేకత ఉంది. అయినా సరే మళ్ళీ ఆయనే పోటీ చేస్తారని వైవీ ప్రకటించారు. ఇలా వైవీ ప్రకటనలతో వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అసంతృప్తికి గురయ్యారు. ఎందుకంటే ఆయన ఎలమంచిలి గాని, పెందుర్తి సీటు గాని ఆశిస్తున్నారు.
2009లో పంచకర్ల ప్రజారాజ్యం నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టిడిపి నుంచి ఎలమంచిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడిపోయి..వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీలో సీటు క్లారిటీ లేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక టిడిపిలో ఈయనకు ఏ సీటు వస్తుందో చూడాలి.