రానున్న ఎన్నికల్లో గెలుపు అనేది టిడిపికి ముఖ్యం..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ సారి గెలవకపోతే టిడిపి పరిస్తితి ఎలా ఉంటుందో ఊహాకే అందదు. అందుకే చంద్రబాబు పార్టీని గెలిపించడం కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్ధిని పెట్టడమే టార్గెట్ గా ముందుకెళుతున్నారు. గతంలో మాదిరిగా ఈ సారి మొహమాటలు లేవని బలమైన అభ్యర్ధి అయితేనే సీటు ఇస్తానని లేదంటే సీటు ఇవ్వనని చెప్పేస్తున్నారు.
ఈ క్రమంలో పలు స్థానాల్లో మార్పులు కూడా చేశారు. ఇక అసెంబ్లీ స్థానాల్లో గెలుపుకు పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్ధులు ఉండాలి. వారి ప్రభావం అసెంబ్లీలపై ఉంటుంది. అందుకే పార్లమెంట్ స్థానాల్లో కూడా బలమైన అభ్యర్ధులని పెట్టాలని బాబు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం(బందరు) పార్లమెంట్ లో మార్పులు చేయనున్నారని ప్రచారం వస్తుంది. గత మూడు పర్యాయాలు టిడిపి నుంచి కొనకళ్ళ నారాయణ పోటీ చేస్తున్నారు. 2009, 2014లో గెలిచారు. 2019లో ఓడిపోయారు.
అయితే ఈ సారి ఆయన్ని మార్చేసి వేరే అభ్యర్ధిని పెడతారని టాక్ నడుస్తుంది. గతంలో ఆయన గెలుపుకు సొంత సామాజికవర్గం గౌడ వర్గం సహకరించింది. పార్టీలకు అతీతంగా గౌడ వర్గం ఓట్లు కొనకళ్ళకు పడేవి. కానీ 2019లో ఎన్నికల్లో అలా జరగలేదు. ఈ సారి కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది. దీంతో ఆయన్ని మార్చేసి మరొక అభ్యర్ధిని దింపుతారని తెలుస్తుంది.
ఇప్పటికే మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తెని బందరు ఎంపీగా బరిలో దింపుతారని టాక్. అదే సమయంలో వంగవీటి రాధాని పోటీకి దింపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. లేదా పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వస్తుంది. చూడాలి మరి బందరు ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందో.