అధికారికంగా టీడీపీ-జనసేనల మధ్య పొత్తు సెట్ కాలేదు..కానీ క్షేత్ర స్థాయిలో పొత్తు ఉంటుందని రెండు పార్టీల శ్రేణులు ఫిక్స్ అయిపోయాయి. చంద్రబాబు, పవన్ పొత్తు దిశగానే ముందుకెళుతున్నారని కేడర్కు సంకేతాలు అందాయి. దీంతో రెండు పార్టీలు కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. కాకపోతే కలిసి పనిచేయడం ఒక ఎత్తు అయితే..సీట్ల పంపిణీ మరో ఎత్తు. కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల నేతలు పట్టు వదలడం లేదు.
ఇప్పటినుంచే సీట్ల అంశంలో పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంపై అటు టిడిపి, ఇటు జనసేన నేతలు పోటీ పడుతున్నారు. ఈ సీటు తమకంటే తమకే అని పట్టు బడుతున్నారు. దీంతో ఈ సీటు విషయంలో ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. సీట్ల విషయం బాబు, పవన్ చూసుకుంటారు. అయినా సరే ఇక్కడ నేతలు ఇప్పటినుంచే పట్టుబడుతున్నారు. వాస్తవానికి ముమ్మిడివరం టిడిపి కంచుకోట. 1983, 1985, 1996 ఉపఎన్నిక, 1999, 2014 ఎన్నికల్లో గెలిచింది. 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల ఇక్కడ టిడిపి కేవలం 1925 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
ఇక 2019 ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపి ఓడింది. 5 వేల ఓట్ల తేడాతో ఓడింది. అయితే ఈ సారి ఎలాగైనా గెలుచుకోవాలని టిడిపి నేత దాట్ల సుబ్బరాజు పనిచేస్తున్నారు. ఈ సీటు ఎట్టి పరిస్తితుల్లో తనకే దక్కుతుందని అంటున్నారు. ఇక అటు జనసేన నేత పితాని బాలకృష్ణ సైతం ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ముమ్మిడివరంపై పట్టుబడుతున్నారు.
వాస్తవానికి జనసేన కంటే టిడిపికి డబుల్ బలం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి 78 వేల ఓట్లు పడితే..టిడిపికి 73 వేల ఓట్లు వరకు పడ్డాయి. జనసేనకు 33 వేల ఓట్లు పడ్డాయి. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు టిడిపికి బలం ఎక్కువని. దాదాపు ఈ సీటు టిడిపికే దక్కే ఛాన్స్ ఉంది. కానీ జనసేన మద్ధతు ఎలా ఉంటుందనేది చూడాలి.