ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువనే సంగతి తెలిసిందే. జిల్లాలో టిడిపికి కంచుకోట లాంటి స్థానాలు చాలానే ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కంచుకోటల్లో కూడా దారుణంగా ఓడిపోయింది. కానీ ఈ సారి గెలిచి తీరాలనే పట్టుదలతో తెలుగు తమ్ముళ్ళు పనిచేస్తున్నారు. అలా మైలవరం నియోజకవర్గంలో ఈ సారి ఖచ్చితంగా గెలవాలని దేవినేని ఉమా కష్టపడుతున్నారు. మైలవరం మొదట నుంచి టిడిపికి అనుకూలమైన స్థానమే. 1983, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలిచింది.
అయితే 1999, 2004 ఎన్నికల్లో ఉమా నందిగామ నుంచి గెలిచారు. కానీ 2008లో నందిగామ ఎస్సీ రిజర్వ్ సీటుగా మారింది. దీంతో అక్కడ పోటీ చేయడం కుదరలేదు. పక్కనే ఉన్న మైలవరంకు వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2014లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి ఉమాకు ఓటమి ఎదురైంది. అది కూడా తన చిరకాల ప్రత్యర్ధి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. గతంలో వసంత తండ్రి నాగేశ్వరరావుతో పాటు కృష్ణప్రసాద్ని నందిగామలో ఉమా ఓడించారు.
2019లో మాత్రం మైలవరంలో ఉమాని వసంత ఓడించారు. ఇలా సీన్ రివర్స్ అయింది. ఇక ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే కసితో ఉమా పనిచేస్తున్నారు. కాకపోతే టిడిపిలో ఓ వర్గం ఉమాకు మద్ధతు ఇవ్వడం లేదు. అయినా సరే ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. టిడిపి నుంచి ఆయన బరిలో ఉండటం ఖాయం. ఇక వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు.
ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత మళ్ళీ పోటీ చేస్తారా? లేక పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేశ్..మైలవరం వచ్చి పోటీ చేస్తారా? అనేది తెలియడం లేదు. ఎందుకంటే జోగి సొంత స్థానం మైలవరం..2014లో ఇక్కడే పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పెడనలో గెలిచారు. ఈ సారి మైలవరం రావాలని చూస్తున్నట్లు తెలిసింది. దీంతో వసంత, జోగి వర్గాల మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇక ఈ ఇద్దరిలో ఎవరు దేవినేని ప్రత్యర్ధిగా నిలబడతారో క్లారిటీ లేదు. ఎవరు నిలబడిన ఈ సారి గెలుపు అవకాశాలు దేవినేనికే ఉన్నాయి.