ఉమ్మడి కృష్ణా జిల్లా చివరిన..గుంటూరు జిల్లాకు బోర్డర్ లో..అటు సముద్రం…ఇటు కృష్ణా నది ఎండింగ్ పాయింట్..ఇలా బౌగోళికంగా భిన్నమైన పరిస్తితులు…ఎంతోమంది రాజకీయ ఉద్దండులు తలపడిన ప్రాంతంగ ఉన్న అవనిగడ్డని దివిసీమ అని కూడా అంటారు. దివిసీమ ఉప్పెన గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆరు మండలాలతో కృష్ణా జిల్లాలో అతి పెద్ద నియోజకవర్గంగా ఉండే అవనిగడ్డలో ఈ సారి రాజకీయంగా ఎవరు పై చేయి సాధిస్తారనే చర్చ సాగుతుంది.
ఇప్పటివరకు ఇక్కడ కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ ఆరుసార్లు గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ తొలిసారి గెలిచింది. వైసీపీ నుంచి సింహాద్రి రమేశ్ బాబు గెలిచారు. ఈయన ఎమ్మెల్యేగా గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం, రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఏదో ప్రభుత్వ పథకాలే ఎమ్మెల్యేకు ప్లస్. అయినా సరే ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక టిడిపి నుంచి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. సౌమ్యంగా ఉండే ఈయన..నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై గట్టిగానే గళం విప్పుతున్నారు. టిడిపి బలం పెంచుకుంటూ వెళుతున్నారు.
ఇక్కడ జనసేన కూడా చాలా కీలకం..ఎందుకంటే ఇది పూర్తిగా కాపు వర్గం ప్రభావం ఉన్న స్థానం. గత ఎన్నికల్లో వైసీపీకి 78 వేల ఓట్లు, టిడిపికి 57 వేలు, జనసేనకు 28 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ గెలిచేది కాదు. ఇక ఇక్కడ కాపు ఓట్లు 70 వేలు, బీసీలు 64 వేలు, ఎస్సీలు 41 వేలు, ఎస్టీలు 6 వేలు, కమ్మ వర్గం 10 వేలు, ముస్లింలు 4 వేల వరకు ఉంటారు.
అయితే గత ఎన్నికల్లో మూడు పార్టీల అభ్యర్ధులు కాపు వర్గమే. దీంతో కాపు ఓట్లు చీలిపోయాయి. ఇక బిసి, ఎస్సీ, ఎస్టీ మెజారిటీ ఓట్లు వైసీపీకి పడ్డాయి. అందుకే వైసీపీ గెల్చింది. ఈ సారి ఆ పరిస్తితి లేదు. బిసిలు సగం టిడిపి వైపు ఉన్నారు. ఇక పొత్తు ఉంటే ఈ సీటు కావాలని జనసేన అడుగుతుంది. సీటు ఎవరికి దక్కిన టిడిపి-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి చెక్ పడటం ఖాయం.