రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి..ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి నాయకులు పదునైన వ్యూహాలు వేస్తారు. అయితే ఈ వ్యూహాలు కుట్రపూరితంగా ఉండవు. అలా వ్యూహాలు వేసి ఒకప్పుడు గెలిచేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సీన్ మారిపోయింది. వికృత రాజకీయాలు మొదలయ్యాయి.
గత ఎన్నికల ముందు పీకే..వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపిని దెబ్బకొట్టడానికి దారుణమైన వ్యూహాలు అమలు చేశారు. మొదట టిడిపికి ఒక కులాన్ని అంటగట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా క్రియేట్ చేశారు. దారుణమైన అబద్దాలు చెప్పారు. సోషల్ మీడియా లో దారుణమైన రాజకీయం చేశారు. వ్యక్తిత్వ హననం చేశారు.
ఇక మాట ఇస్తే తప్పరు అంటూ జగన్..అనేక హామీలు ఇచ్చారు..ప్రజలని మభ్యపెట్టారు. చివరికి గెలిచారు. అధికారంలోకి వచ్చాక అదే తరహా వ్యూహాలతో ముందుకెళుతున్నారు. మళ్ళీ టిడిపిని దెబ్బతీసి వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం పనిచేస్తుంది. ఈ టీం ప్రతి దానిలో జోక్య చేసుకుంటుంది. ఓ రకంగా పాలన ఐప్యాక్ టీం చేస్తుందా? అనే పరిస్తితి. జగన్ సైతం వైసీపీ నేతలని కాకుండా ఐప్యాక్ టీం పైనే ఆధారపడ్డారు.
ఈ టీం చేసే పని ఏంటంటే.. విధ్వంసకర’ వ్యూహాలను అందించడం..కులాల మధ్య చిచ్చు పెట్టడం, లేనిది ఉన్నట్లు సృష్టించడం, ఎదుటి వాళ్ల బలహీనతలు, పొరపాట్లను భూతద్దంలో చూపించడం, అన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడం..టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగించడం..దొంగ ఓట్లు సృష్టించడం..ఇలా చేసి మళ్ళీ వైసీపీని గెలిపించాలని చూస్తున్నారు. అయితే ఈ సారి కూడా ఐప్యాక్ ని నమ్మి ప్రజలు వైసీపీని గెలిపించే అవకాశాలు పెద్దగా లేవు. ప్రజలకు నిజాలు ఏంటో తెలుస్తున్నాయి. కాబట్టి ఈ సారి ఐప్యాక్ కుట్రలు వర్కౌట్ కావు.