ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం కోసం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లకు ప్రభుత్వం పారితోషికం ఇస్తోంది. ప్రభుత్వం నుంచి పారితోషకం తీసుకుంటూ వైసీపీ తమ పార్టీ కార్యక్రమాలకు వాలంటీర్లను వాడుకుంటుందని వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. ఈ వార్తలను దూరం చేయడానికి వాలంటీర్లపై గృహసారథులు అనే వారిని ప్రవేశపెట్టి వారి ద్వారా పార్టీ కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. కానీ వాలంటీర్ల దగ్గర ఉన్న డేటా కోసం, వారిలో వైసీపీ సానుభూతి పరులు ఎవరు? టిడిపి సానుభూతిపరుల ఓట్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని అందరూ అంటున్నారు.
ఆ వార్తలకు బలం చేకూరుస్తూ నెల్లూరులో వాలంటీర్లతో వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన రహస్య సమావేశం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. కానీ కొన్ని చోట్ల రహస్యంగా ఓటర్ల మార్పు, తొలగింపు మొదలైన వాటికోసం ఎన్నికల సిబ్బంది వాలంటీర్లను ఉపయోగిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. టిడిపి సానుభూతిపరుల ఓట్లను వాలంటీర్ల సహాయంతో తొలగిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు.
నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండల కేంద్రంలో కృష్ణాష్టమి రోజున వాలంటీర్లతో వైసిపి ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఆనం రామనారాయణ సమావేశం వద్దకు వెళ్లి వైసిపి నాయకులను నిలదీశారు. వాలంటీర్లతో వైసిపి నాయకులకు ఏం పని అని ఆనం మండి పడ్డారు. సమావేశం గురించి వైసిపి నేతలు సరిగా వివరణ ఇవ్వలేకపోవడంతో అక్కడ ఫోటోలను వీడియోలతో కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు.
వైసిపి నేతలు వాలంటీర్ల నుండి ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారి సమాచారం గురించి తెలుసుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బంది ఏమీ లేదు కానీ వాటిని ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఏదేమైనా వాలంటీర్లను ఉపయోగించుకొని వైసిపి నేతలు ఈసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. దీనికి టిడిపి సాధ్యమైన మేర చెక్ పెట్టడానికే ప్రయత్నిస్తుంది.