అధికారంలో ఉన్న పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలి కానీ ప్రతిపక్షాలను వేధించే విధంగా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండకూడదు. చంద్రబాబు నాయుడు తప్పు చేశారా లేదా అన్నది పక్కన పెడితే ఆయనను సరైన ఆధారాలు చూపకుండా, నోటీసులు ఇవ్వకుండా, అక్రమంగా అరెస్టు చేశారన్నది సామాన్య ప్రజలకు సైతం అర్థమవుతుంది. ఇప్పుడు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించి జైల్లో పెట్టామని సంబరాలు చేసుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇప్పుడు వైసిపి వారందరికీ సంతోషంగానే ఉంది కానీ వీరి అదృష్టం బాగోక వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకపోతే, టిడిపి అధికారంలోకి వస్తే ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న వారి పరిస్థితి ఏమిటో???
నాలుగేళ్ల నుంచి టిడిపి కార్యకర్త అయితే చాలు వాడిని వేధించడమే పనిగా పెట్టుకుంది వైసీపీ ప్రభుత్వం. టిడిపి సానుభూతిపరులు అయిన ప్రభుత్వ ఉద్యోగులను సైతం వైసిపి నాయకులు వదలలేదు. అవినీతి చేస్తున్నారని నిలదీసిన ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేశారు. అంగబలం, అర్ధబలం ,పోలీసు బలం తనవైపు ఉన్నాయని అందరిని ఇబ్బందులకు గురి చేసింది వైసిపి ప్రభుత్వం, వైసీపీ నాయకులు. తప్పు అని నిలదీసిన వారిని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసి, కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులు పాలు చేశారు. అభివృద్ధి గురించి అడిగిన నాయకులను వైసీపీ కార్యకర్తల ముసుగులో గుండాలతో కొట్టించారు. ప్రభుత్వం గురించి మాట్లాడడానికి ఎవరైనా భయపడే విధంగా తన పాలన సాగిస్తోంది వైసీపీ ప్రభుత్వం.
దెబ్బ కొట్టిన వాడు మర్చిపోవచ్చు గానీ, తిన్నవాడు ఎప్పుడు మర్చిపోడు కదా ఈసారి అధికారంలోకి టిడిపి వస్తే వీరందరి పరిస్థితి ఏమిటో వారి ఊహకే వదిలేయాలి…..