టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీనే ఆధిక్యం సాధించింది. కానీ ఈ సారి ఇక్కడ పట్టు సాధించాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. అయితే కొంతమేర టిడిపి బలం పుంజుకుంది. కానీ ఇప్పటికీ వైసీపీకే ఆధిక్యం ఉంది. పైగా కొన్ని నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన అభ్యర్ధులు లేకపోవడం మైనస్ అవుతుంది.
ఈ క్రమంలో అక్కడ కీలకమైన చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో టిడిపికి అసలు అభ్యర్ధులు ఎవరో తెలియకుండా ఉంది. చిత్తూరు అసెంబ్లీకి ఇంచార్జ్ కూడా లేరు. తిరుపతిలో సుగుణమ్మ ఉన్నారు..కానీ ఆమె బలం సరిపోవడం లేదు. ఇలా రెండు చోట్ల టిడిపి లో కన్ఫ్యూజన్ ఉంది. ఈ రెండు చోట్ల జనసేనకు కాస్త బలం ఉంది. పొత్తు ఉంటే ఈ రెండు సీట్లలో ఒక సీటు జనసేనకు దక్కుతుందని అంటున్నారు. ఇటు ఎంపీ సీట్లలో కూడా అదే పరిస్తితి ఉంది. చిత్తూరు ఎంపీ సీటు అంటే టిడిపి కంచుకోట.
కుప్పంలో వచ్చే మెజారిటీతో చిత్తూరు ఎంపీ సీటు టిడిపి గెలుచుకుంటూ వస్తుంది. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. పైగా మాజీ ఎంపీ శివప్రసాద్ చనిపోయారు. దీంతో అక్కడ టిడిపి అభ్యర్ధి ఎవరనేది ఇంతవరకు తేలలేదు. ఇక తిరుపతి ఎంపీ స్థానంలో పనబాక లక్ష్మీ ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత ఉపఎన్నికలో ఓడిపోయారు.
ఇక ఈ సారి ఆమెని మళ్ళీ బరిలో దింపుతారా? పొత్తులో భాగంగా జనసేనకు ఏమైనా కేటాయిస్తారా? అనేది తేలలేదు. మొత్తానికి చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ టిడిపి అభ్యర్ధులు ఎవరనేది క్లారిటీ లేదు.