టిడిపికి మంచి పట్టు ఉన్న నియోజకవర్గాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ఒకటి. 2019లో జగన్ గాలిలో కూడా ఇక్కడ టిడిపి నే విజయం సాధించిందంటే గుంటూరు వెస్ట్ లో టిడిపి కి ఎంత పట్టు ఉందో తెలుస్తోంది. టిడిపి నుంచి పోటీ చేసేందుకు ఈ నియోజకవర్గానికి భారీగానే అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో ముఖ్యంగా ఐదుగురు నేతలు పోటీ పడుతున్నారు. గుంటూరు వెస్ట్ టిడిపి ఇంచార్జ్ కోవెలమూడి నాని టికెట్ ఆశిస్తున్నారు. తను లోకల్ అని, పార్టీలో మంచి పట్టు ఉందని తనకి ఈసారి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. నానితో పాటు తెనాలి జనసేన పొత్తులో ఇచ్చే అవకాశాలు ఉన్నందున ఆలపాటి రాజా కూడా గుంటూరు వెస్ట్ వైపే చూస్తున్నారు.
తెనాలి లో సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్నందుకు తనకు ఈసారి గుంటూరు వెస్ట్ టికెట్ కేటాయించాల్సిందే అని పట్టుబడుతున్నారు. గుంటూరు వెస్ట్ టికెట్ మంచి గిరాకీ ఉందని చెప్పవచ్చు. ఈ టికెట్ కోసం ఎన్నారైలు కూడా పోటీ పడుతున్నారు. ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు నియోజకవర్గం లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. గత జనవరిలో మహిళలకు జనతా వస్త్రాల పంపిణీ అనే కార్యక్రమంతో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో తొక్కిసులాట జరగడంతో కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారు. మళ్ళీ తెరపైకి వచ్చి రాజకీయాల్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో 36 గంటల నిరాహార దీక్ష చేసి తన నిరసనను తెలియజేశారు.
వీరితోపాటు మన్నవ మోహనకృష్ణ కూడా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లోనే ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి నిరాశ చెందిన మోహనకృష్ణ ఈసారైనా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరికి పోటీగా బీసీ సామాజిక వర్గం వారైనా డాక్టర్ శేషయ్య టికెట్ కోరుతున్నారు. డాక్టర్ శేషయ్యకు మంచి పేరుంది. ప్రజలందరికీ సుపరిచితుడు మరి ఈయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నారు.
ఇంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటే టికెట్ ఎవరికి ఇవ్వాలో తెలియని అయోమయంలో అధిష్టానం ఉండగా,ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి గుంటూరు వెస్ట్ పై ఈసారి ఎవరి గెలుపు ముద్ర వేస్తారో వేచి చూడాల్సిందే.