టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయా? ఈ సారి ఆయనకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చా? అంటే రాజకీయాల్లో 30 ఏళ్ల నుంచి ఉంటున్న జ్యోతుల నెహ్రూకు వయసు మీద పడింది..ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఈ సారి ఎన్నికలు లాస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అందుకే ఈ సారి గెలుపు కోసం చావో రేవో అన్నట్లు పోరాడాల్సిన పరిస్తితి.
జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఆయన ఖచ్చితంగా గెలిచి తీరాలని చూస్తున్నారు. అయితే జగ్గంపేట ముందు నుంచి టిడిపి, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉండేది. ఇక 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా టిడిపి గెలవగా, 1991 ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి జ్యోతుల నెహ్రూ గెలిచారు. మళ్ళీ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే 2009లో జ్యోతుల ప్రజారాజ్యంకు వెళ్ళి ఓడిపోయారు. అప్పుడు టిడిపి నుంచి జ్యోతుల చంటిబాబు పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
ఇక 2014లో జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు..చంటిబాబు టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నెహ్రూ టిడిపిలోకి, చంటిబాబు వైసీపీలోకి వెళ్లారు. దీంతో 2019లో చంటిబాబు వైసీపీ నుంచి గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా చంటిబాబు అనుకున్న మేర పనులు చేయడం లేదు..ప్రజా వ్యతిరేకత కాస్త పెంచుకున్నారు.
ఇటు టిడిపిలో నెహ్రూ బలపడ్డారు. నెహ్రూ తనయుడు నవీన్ నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతూ బలం పెంచారు. అయితే రానున్న ఎన్నికల్లో నెహ్రూనే బరిలో దిగనున్నారు. అలాగే ఆయనకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక టిడిపితో జనసేన పొత్తు ఉంటే నెహ్రూకు కలిసొస్తుంది.