టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం దగ్గర నుంచి ఊహించని స్థాయిలో రోడ్ షోలు, సభలకు జనం తరలివస్తున్నారు. దీంతో టిడిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది. అటు నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇక బాబు సాగునీటి ప్రాజెక్టులని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై యుద్ధం ప్రకటించారు.
ఇప్పటికే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ప్రాజెక్టులు పరిశీలించారు, రోడ్ షోలు చేశారు. నందికొట్కూరు, పులివెందుల, కదిరిలో భారీ సభల్లో పాల్గొన్నారు. మూడు సభలకు ఊహించని స్థాయిలో జనం వచ్చారు. తాజాగా చిత్తూరులో రోడ్ షో నిర్వహించిన ఆయన..పూతలపట్టులో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. దీంతో పూతలపట్టులో టిడిపి గెలవదని ఎగతాళి చేసేవారికి సమాధానం దొరికిందని అక్కడ టిడిపి ఇంచార్జ్ జర్నలిస్ట్ మురళీమోహన్ చెప్పుకొచ్చారు. మరి నిజంగానే బాబు సభతో పూతలపట్టులో టిడిపి గెలుపు దిశగా వెళుతుందా? అంటే డౌటే లేదనే చెప్పవచ్చు.
ఎస్సీ రిజర్వ్ సీటుగా ఉన్న పూతలపట్టులో టిడిపికి బలం తక్కువే. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడగా, 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో టిడిపి ఓడిపోయింది. 2019లో జగన్ వేవ్ లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి ఎంఎస్ బాబు గెలిచారు. ప్రమాణస్వీకారమే తప్పుల తడకగా చదివి మొదట్లోనే బాబు హైలైట్ అయ్యారు.
ఇక నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం..ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అయినా..పెత్తనం పెద్దిరెడ్డిదే అనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ అక్రమాలకు కొదవ లేదని టిడిపి ఆరోపిస్తుంది. ఇవన్నీ వైసీపీకి మైనస్. అయితే మొన్నటివరకు టిడిపికి ఇంచార్జ్ లేకపోవడం మైనస్. ఇటీవలే ఇంచార్జ్ గా మురళీమోహన్ని పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో పూతలపట్టు సభ భారీ సక్సెస్ అయింది. ఇక్కడ నుంచే పూతలపట్టులో టిడిపి గెలుపు దిశగా వెళుతుందని చెబుతున్నారు. మరి జర్నలిస్ట్ మురళీ..పూతలపట్టులో టిడిపిని గెలిపిస్తారో లేదో చూడాలి.