ఎన్నికల సమయం దగ్గరపడటంతో టిడిపిలోకి వలసలు ముమ్మరం అవుతున్నాయి. టిడిపికి గెలుపు అవకాశాలు మెరుగు పడిన నేపథ్యంలో ఆ పార్టీలోకి వలస వచ్చే నేతల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే వైసీపీ నుంచి కొందరు కీలక నేతలు టిడిపిలో చేరారు. ఇదే క్రమంలో వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరనున్నారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. కానీ ఆ ప్రచారం ఇప్పుడు నిజమవుతుందని తెలుస్తోంది.
ఈ నెల 20వ తేదీల్లో నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో విజయవాడకు పాదయాత్ర వచ్చిన సమయంలో యార్లగడ్డ టిడిపిలో చేరనున్నారని తెలిసింది. ఎన్ఆర్ఐగా వచ్చిన యార్లగడ్డ..గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీలో పోటీ చేసి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. ఇక టిడిపి నుంచి గెలిచిన వంశీ..వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో యార్లగడ్డ, వంశీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పలుమార్లు జగన్..వీరి మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నారు..కానీ సెట్ కాలేదు.
ఇక గన్నవరం వైసీపీ అభ్యర్ధిగా వంశీ ఫిక్స్ అయిపోయారు. అయితే తాను కూడా గన్నవరంలోనే పోటీ చేస్తానని, ఏ పార్టీ అనేది కాలమే నిర్ణయం ఇస్తుందని ఆ మధ్య యార్లగడ్డ చెప్పారు. దీంతో ఆయన ఇప్పుడు తన అనుచరులతో సమావేశమై..టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలిసింది.
టిడిపిలో చేరితే గన్నవరం సీటు ఇస్తే..అక్కడ సమీకరణాలు మారిపోతాయి. యార్లగడ్డపై సానుభూతి ఉంది. అటు వైసీపీలో వంశీతో పడని వారు యార్లగడ్డ వెంట నడిచే ఛాన్స్ ఉంది. ఇటు గన్నవరంలో టిడిపి శ్రేణులు బలంగా ఉన్నాయి. దీంతో గన్నవరంలో వంశీకి గట్టి పోటీ ఎదురై ఛాన్స్ ఉంది. చూడాలి మరి యార్లగడ్డ టిడిపిలోకి వస్తారా? పోటీ చేస్తారా? అనేది.