ఉమ్మడి విశాఖ జిల్లాలో టిడిపికి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అలా కంచుకోటల్లో పాయకరావుపేట కూడా ఒకటి. ఇక్కడ టిడిపి ఆవిర్భావం నుంచి సత్తా చాటుతుంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా గెలిచింది. 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టిడిపి కేవలం 656 ఓట్ల తేడాతో ఓడింది. 2014లో మళ్ళీ టిడిపి గెలిచింది. 2019 ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం జరిగింది.
2019లో వైసీపీ నుంచి గొల్ల బాబూరావు గెలిచారు. అయితే ఈయన ఎమ్మెల్యేగా పూర్తిగా విఫలమయ్యారని సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది లేదు..ప్రజా సమస్యలు పట్టించుకునేది లేదు. అక్రమాలు పెరిగిపోయాయనే ఆరోపణలు పెరిగాయి. దీంతో సొంత పార్టీ వాళ్ళే ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ ఆయనకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. ఇలా వైసీపీకి పెద్ద మైనస్ ఉంది.
ఇక 2014లో టిడిపి నుంచి గెలిచి..2019లో కొవ్వూరు వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిన వంగలపూడి అనిత..ఇప్పుడు పాయకరావుపేట ఇంచార్జ్ గా ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అనితకు బలం పెరిగింది. వైసీపీకి ఉన్న మైనస్సే అనితకు పెద్ద ప్లస్. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే టిడిపికి ప్లస్. ఇవన్నీ కలిసొస్తే అనిత మళ్ళీ గెలవడం ఖాయం. అయితే వైసీపీ నుంచి అభ్యర్ధిని మార్చే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది.
బలమైన అభ్యర్ధి రంగంలోకి దిగితే కాస్త గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. కానీ వైసీపీపై వ్యతిరేకత, జనసేనతో పొత్తుతో ఇక్కడ అనిత గెలుపుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.