అధికార వైసీపీలో ఆధిపత్య పోరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..ఎందుకంటే ఆ పార్టీలో పోరు జరగని రోజు లేదు..నియోజకవర్గం లేదన్నట్లే ఉంది. గత ఎన్నికల ముందు టిడిపిలో కూడా ఇలాంటి రచ్చ నడిచేది. దీని వల్ల టిడిపికి ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు వైసీపీ పరిస్తితి అదే అనే విశ్లేషణలు వస్తున్నాయి. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే కీలకమైన ఉమ్మడి తూర్పుగోదావరి లోని రాజమండ్రి పరిధిలో ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య పోరు మొదట నుంచి జరుగుతూనే ఉంది.
ఒకానొక సమయంలో వీరు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టుకుని తిట్టుకున్నారు. తర్వాత వైసీపీ అధిష్టానం క్లాస్ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. అయినా అంతర్గతంగా వార్ నడుస్తూనే ఉందట. అయితే ఇద్దరు యువనేతలు గత ఎన్నికల్లో జగన్ గాలిలో భరత్..రాజమండ్రి ఎంపీగా, రాజా రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రాజమండ్రిపై పట్టు కోసం ఇద్దరు నేతలూ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇదే సమయంలో రాజమండ్రి సిటీ సీటు విషయంలో రచ్చ నడుస్తుంది. అక్కడ తాను నిలబడి సత్తా చాటాలని భరత్ చూస్తుంటే…తన వర్గం నేతకు సీటు ఇప్పించుకోవాలని రాజా చూస్తున్నారు. ఒకవేళ భరత్కు సీటు దక్కితే..సిటీలో రాజా వర్గం యాంటీ అవుతుంది. ఇక రాజానగరంలో తన సొంత వర్గం గౌడ/శెట్టిబలిజ వర్గం రాజాకు యాంటీ అయ్యేలా భరత్ ప్లాన్ చేస్తున్నారు.
దీని వల్ల రెండు సీట్లలో వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఎలాగో రాజమండ్రి సిటీ టిడిపి కంచుకోట..అటు రాజానగరంలో టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పడుతుంది. మొత్తానికి భరత్-రాజాల వల్ల రెండు సీట్లలో వైసీపీ నష్టపోయేలా ఉంది.