జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికి మూడు విడతలుగా వారాహి యాత్రను చేశారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాలవల్ల యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ యాత్రను తిరిగి ప్రారంభించాలని ఆలోచనలో ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈసారి జనసేన టిడిపి పొత్తు నేపథ్యంలో నాలుగో విడత వారాహి యాత్ర ప్రత్యేకతను సంతరించుకుంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర సాగుతుంది. ఈసారి కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాలలో వారాహి యాత్ర కొనసాగుతుంది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా రూట్ మ్యాప్ ను కూడా రూపొందించారు.
పొత్తుల్లో భాగంగా జనసేన..అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు స్థానాలు జనసేన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ నాలుగు సీట్లలో టిడిపికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దాదాపు 50 వేలు పైనే ఓట్లు ఉన్నాయి. జనసేనకు 20 వేల వరకు ఓటు బ్యాంక్ ఉంది. అయితే మచిలీపట్నంలో కొల్లు రవీంద్రకే టికెట్ అని టిడిపి అధిష్టానం చెబుతోంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.
పెడనలో ఎప్పటినుంచో పట్టు ఉన్న కాగిత కుటుంబానికి ఈసారి టికెట్ ఇవ్వాలని టిడిపి భావిస్తోంది. టిడిపి జనసేన పొత్తులో పెడన అడిగిన అక్కడ మెజారిటీ ఓటర్లు టిడిపి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ వైపే చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇటు అవనిగడ్డలో టిడిపి నుంచి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు.
మరి ఈ సీటుని టిడిపి త్యాగం చేస్తుందో లేదో చెప్పలేం. అటు కైకలూరులో టిడిపి ఓటు బ్యాంక్ ఉన్నా నాయకుడు లేరు. ఈ సీటు తప్పనిసరి పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వడం ఖాయమే. మరి మిగిలిన సీట్లలో ఏది దక్కుతుందో చూడాలి.