ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్…జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాలంటీర్ల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తుంది. తాజాగా ఏలూరు పర్యటనలో పవన్..వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో మిస్ అయిపోతున్న మహిళలకు వాలంటీర్లే కారణమని, వాలంటీర్లు ఏ కుటుంబంలో మహిళలు ఎంతమంది ఉన్నారు..వితంతువులు, ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని ఆరోపించారు.
దీనిపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు వాలంటీర్లు నిరసనలు చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశంపై పవన్ తగ్గడం లేదు. వాలంటీర్ల పొట్ట కొట్టాలని తనకు లేదని, అలాగే అందరు వాలంటీర్లని అనడం లేదని, కొందరు వాలంటీర్లు అలా చేస్తున్నారని అన్నారు. కొందరు చేస్తున్న ఘాతుకాలనే ప్రజల దృష్టికి తెచ్చానని, వంద తాజా పండ్లలో ఒక్కటి కుళ్లినా అన్నీ పాడైపోతాయని చెప్పారు.
కేంద్ర నిఘా వర్గం ఇచ్చిన స్పష్టమైన సమాచారంతో, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ కొందరు వలంటీర్లు చేస్తున్న ఘాతుకాన్ని తెలియజేయాలనే చెప్పానని, ప్రజలను నియంత్రించేందుకు, బెదిరించేందుకే వలంటీర్ వ్యవస్థను జగన్ డిజైన్ చేసి వదిలాడని.. అందుకే అన్ని పార్టీల నాయకులు ఈ వలంటీర్లపై, వాళ్లు సేకరిస్తోన్న వివరాలపై ఒక కన్నేసి ఉంచాలని కోరారు.
అయితే వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలే…అందులో డౌట్ లేదు. ఇక వారిలో కొందరు మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పింఛన్ డబ్బులు ఎత్తుకుపోయారని, అలాగే ఇతర పార్టీలని బెదిరిస్తున్నారని, వైసీపీకి మద్ధతుగా ఉండకపోతే పథకాలు ఇవ్వమని భయపడుతున్నారని, ఓటర్ల లిస్టులో అవకతవకలు చేయడంలో సహకరిస్తున్నారని..ఇలా వాలంటీర్లపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ ఆరోపణలు చేశారు.
అయితే వాలంటీర్లపై దాదాపు అన్నీ వర్గాలు అసంతృప్తిగానే ఉన్నారు. ఒక్క వైసీపీ వర్గం తప్ప..ఇక వారి ఓట్లు ఎలాగో వైసీపీకే పడతాయి. కానీ వారిపై పవన్ చేసిన ఆరోపణలు ప్రజల్లోకి వెళ్ళాయి. దీంతో వైసీపీకే ఇంకా డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది.