ఖమ్మం జిల్లా పాలేరులో గెలిచి తీరుతానని సవాల్ విసురుతున్న మాజీ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నట్టే కనిపిస్తోంది. శ్రీనివాసరెడ్డి కొద్దిరోజుల క్రితం బిఆర్ఎస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ను టార్గెట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా గెలవనీయనని.. ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తోన్న బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఏ ఒక్కరిని అసెంబ్లీ గేటు కూడా దాటానియను అంటూ సినిమా స్టైల్ లో డైలాగులు చెప్పారు.

పొంగులేటికి కేసీఆర్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చేశారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి సంగతి దేవుడు ఎరుగు.. కానీ ఇప్పుడు పాలేరులో ఆయనకు ఓటమి భయం పట్టుకున్న సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. పొంగులేటిపై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రెండు నెలలుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనకు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన.. అణువణువునా పరిచయాలు ఉన్నాయి.
ఇటు శ్రీనివాస్ రెడ్డి కనీసం ఒక్క మండలంలో కూడా పూర్తిగా తిరిగిన దాఖలాలు లేవు. అసలు ఇప్పటికీ పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ తో కూడా ఆయన మమేకం కాలేదు. మండల స్థాయిలో కీలక కాంగ్రెస్ నాయకులు ఎవరు ? అన్నది కూడా తెలియని పరిస్థితి. మరి ఇలాంటి పొంగులేటి రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలా పోటీ చేస్తారు ? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా నాన్ లోకల్ కావడంతో కాంగ్రెస్ కేడర్ చాలా మందికి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సహకరించే పరిస్థితి లేదు.

ఇదిలా ఉంటే బీఆర్ ఎస్ లో ఉన్నప్పుడు పొంగులేటి, తుమ్మల వర్గాలు కత్తులు దూసుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి పొంగులేటి.. తుమ్మల చేతులు కలిపినా క్షేత్రస్థాయిలో ఈ రెండు వర్గాలకు చెందిన నాయకులు పూర్తిగా సహకరించుకునే పరిస్థితి అయితే లేదు. పాలేరులో 2016 ఉప ఎన్నికల్లో రాష్ట్రస్థాయి నాయకులు అందరూ ప్రచారం చేయటంతో గెలిచిన తుమ్మల 2018 ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన ఈ నియోజకవర్గానికి రెండేళ్ల పాటు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయారు. ఇక ఇక్కడ కొద్దిగా ఉన్న తుమ్మల అనుచరులు తనకు సహకరిస్తారని.. తన గెలుపు సులువు అవుతుందని పొంగులేటి ముందు నుంచి ఆశలు పెట్టుకున్నారు.

అయితే నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో ఉన్న కొద్దిమంది తుమ్మల అనుచరులు పొంగులేటికీ ఏమాత్రం సహకరించే పరిస్థితి లేదు. అసలు గత ఎన్నికల్లో తుమ్మల ఓటమికి పొంగులేటి కారణం అని వాళ్ళు ఇప్పటికీ పళ్ళు నూరుతున్నారు. దీంతో పైకి తూతూ మంత్రంగా పొంగులేటికి జై కొడుతున్న.. పొంగులేటికి ఓట్లు వేసే పరిస్థితి ఏమాత్రం లేదు. పైగా కందాళ తుమ్మల అనుచరులతో పాటు తుమ్మల వర్గానికి భారీగా ప్రయార్టీ ఇచ్చారు. దీంతో వారంతా ఇప్పుడు కందాళను వదిలి వచ్చేందుకు అస్సలస్సలు ఇష్టపడడం లేదు.
ఇక సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తే అటు కూడా సీపీఎంతో పాటు తుమ్మల అనుచరుల ఓట్లు మళ్లే పరిస్థితి ఉంది. తమ్మినేని 10 వేల ఓట్లు చీల్చినా కూడా ఇంత టఫ్ ఫైట్లో పొంగులేటి ఓడిపోయే ప్రమాదమే ఆయనకు ముంచుకొచ్చేలా ఉంది. ఏదేమైనా ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ ను గెలిపించడం సంగతేమో గాని పాలేరులో పొంగులేటి గెలిస్తే గ్రేట్ అన్నట్టుగా పరిస్థితి ఉంది.
