రాజకీయాల్లో ఏమైనా చేయొచ్చు.. అనే నాయకులకు ప్రజలు ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూనే ఉన్నారు. పైగా.. ఇప్పుడు ప్రజల్లోనూ చైతన్యం పెరిగింది. ఎవరికి అయినా జరుగుతున్న అన్యాయంపై వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పాత కాపులను పక్కన పెట్టి.. కొత్తవారికి టికెట్లు ఇప్పించుకుంటున్న పరిణామాలపై వారు భగ్గుమంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మాజీ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భారీ సెగగా మారింది.
నిన్న మొన్నటి వరకు బీఆర్ ఎస్లో ఉన్న పొంగులేటి.. ఇటీవల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పాలేరు టికెట్ను సొంతం చేసుకున్నారు. అయితే.. తనతో పాటు బీఆర్ ఎస్ నుంచి వచ్చిన వారికి కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయకుండానే అధిష్టా నంపై ఒత్తిడి తెచ్చిమరీ టికెట్లు ఇప్పించుకున్నారు. సత్తుపల్లి, ఇల్లెందులో ఇదే జరిగింది. ఇది.. స్థానికంగా ఉన్న సామాజిక వర్గాలకు.. మంట పుట్టిస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్లో పాతకాపులు రగిలిపోతున్నారు.
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్లో ఉంటూ.. పార్టీ కోసం పనిచేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారం తా ప్రస్తుత ఎన్నికల్లో టికెట్లను ఆశించారు. అయితే.. వీరి ఆశలపై పొంగులేటి నీళ్లు చల్లుతూ.. బీఆర్ ఎస్ నుంచి తన వెంట తెచ్చుకున్న కొత్తవారికి అవకాశం ఇచ్చేలా చక్రం తిప్పారు. దీంతో ఇప్పుడు పాత కాపులు ఇటు కొత్తవారిపైనా.. అటు తమకు టికెట్ రాకుండా అడ్డుపడిన పొంగులేటి పైనా నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా పొంగులేటిని ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు.
ఇల్లెందు:
ఇది గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజవర్గం. ఇక్కడ బంజారాలు, లంబాడాల ఓటు బ్యాంకు ఎక్కువ. అయితే.. ఈ టికెట్ను స్థానికంగా ఉన్న పాత నేతలకు రాకుండా పొంగులేటి అడ్డుపడ్డారనే వాదన వినిపిస్తోంది. పొంగులేటి అనుచరుడు ఆదివాసీ అయిన కోరం కనకయ్యకు టికెట్.. దక్కింది. దీంతో కాంగ్రెస్ను నమ్ముకున్న నేతలతో పాటు బంజారా, లంబాడా నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమను రాజకీయంగా ఛిద్రం చేసేందుకు పొంగులేటి ఇలా చేశాడనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో లంబాడా వర్గానికి చెందిన బాణోతు హరిప్రియ విజయం దక్కించుకున్నారు. కానీ, ఇప్పుడు కోరంకు టికెట్ ఇప్పించుకోవడాన్ని జిల్లాలో లంబాడాలు తప్పుబడుతున్నారు.
పాలేరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న పొంగులేటికి తమ సత్తా చూపించాలని.. ఇక్కడి లంబాడా, బంజారా వర్గాల నాయకులు సవాళ్లు రువ్వుతున్నారు. వీరి ఓట్లు పాలేరులో .. దాదాపు 40 వేలకుపైగా ఉన్నాయి. అయితే.. ఈ దఫా తమను అన్ని విధాలుగా అణగదొక్కేలా వ్యవహరించిన పొంగులేటికి బుద్ధి చెప్పాలని..ఆయనను చిత్తు చిత్తుగా ఓడించాలని సమావేశాలు పెట్టుకుంటోన్న పరిస్థితి. ఏదేమైనా పాలేరులో పొంగులేటి పరిస్థితి రోజు రోజుకు పేనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా మారుతోంది.