మొత్తానికి మూడు రాజధానులు అని ప్రకటించి మూడున్నర ఏళ్ళు దాటాక సిఎం జగన్..విశాఖకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అమరావతి రాజధానిగా ఉన్న రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటించి కొత్త సమస్యకు తెరలేపారు అని చెప్పవచ్చు. పేరుకు మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెబుతున్నారు గాని..పరిస్తితి చూస్తే అలా కనిపించడం లేదు. అభివృద్ధి చేయాలంటే ఎలాగైనా చేయవచ్చు. కానీ రాజధానుల పేరుతో వైసీపీ రాజకీయ లబ్ది పొందాలని స్కెచ్ వేసిందని మాత్రం అర్ధమైంది.

కానీ కోర్టుల పరిధిలో వైసీపీ పప్పులు ఉడకలేదు..ఇంకా రాజధాని అంశం కోర్టులోనే ఉంది. కాకపోతే త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతానని జగన్ అంటున్నారు. ఇప్పటికే మంత్రులు పలుమార్లు ప్రకటనలు చేశారు. త్వరలోనే విశాఖకు రాజధాని వెళుతుందని..అయితే ఇంతవరకు రాజధానికి దిక్కు లేదు. కాకపోతే ఇటీవల విశాఖకు వెళ్తానని, అక్కడ నుంచి పాలన మొదలుపెడతామని జగన్ చెప్పారు.

ఇలా విశాఖ నుంచి పాలన మొదలుపెట్టడం వల్ల అక్కడ రాజకీయంగా వైసీపీకి ఏమైనా కలిసొస్తుందా? అంటే కలిసిరావడం దేవుడెరుగు..ముందు నష్టం జరగకుండా చాలు అనే భావనలో కొందరు వైసీపీ నేతలు ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ హవా నడిచింది. ఇప్పుడు రాజధాని పేరుతో లబ్ది పొందాలని చూస్తున్నారు.

కానీ పరిస్తితి చూస్తే అలా లేదు..రాజధాని పేరుతో వైసీపీ చేసే రాజకీయాన్ని విశాఖ ప్రజలు నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. అయినా అభివృద్ధి కోరుకుంటున్నారు గాని..రాజధాని కాదనే పరిస్తితి. అందుకే విశాఖకు జగన్ వెళ్ళినా సరే అక్కడ వైసీపీకి నష్టమే తప్ప లాభం కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 సీట్లకు 11 గెలుచుకున్నారు. ఈ సారి 4-5 సీట్లు గెలుచుకున్న గొప్పే అనే పరిస్తితి. కాబట్టి జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టిన ప్రయోజనం లేదు.
