జనసేన అధినేత పవన్ కల్యాణ్…ప్రజా బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయలేదు గాని..ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ వారాహి యాత్ర చేస్తూ ప్రజలని కలుస్తూ..వారి మద్ధతు పెంచుకునే దిశగా ముందుకెళుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తూనే మరోవైపు తమ ఓటు బ్యాంకు పెంచుకునేలా ముందుకెళుతున్నారు.
గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లే పడ్డాయి. దాన్ని 15-20 శాతం వరకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఆ దిశగా పవన్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఎలాగో వైసీపీ వ్యతిరేక ఓట్లు మెజారిటీగా టిడిపికి వెళుతున్నాయి. కొంతమేర జనసేనకు వస్తున్నాయి. కానీ అవి సరిపోవు. అందుకే పవన్ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో తనతో పాటు ఉన్న పెద్ద హీరోల ఫ్యాన్స్ ఓట్లు టార్గెట్ చేశారు.
అందుకే పవన్ పదే పదే తనకు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, చిరంజీవి లతో పాటు హీరోలంతా ఇష్టమే అని, తాజాగా అల్లు అర్జున్, బాలకృష్ణ పేర్లు కూడా చెప్పి..ఇంకా హీరోలు ఉన్నారని, వారి అభిమానులు సినిమాల సమయంలో అభిమానం చూపించుకుని..రాజకీయాల్లో మాత్రం ఏకమై రాష్ట్రం కోసం నిలబడాలని అంటున్నారు. అంటే పరోక్షంగా తనకు మద్ధతుగా ఉండాలని కోరుతున్నారు.
అందరూ హీరోలు ఇష్టమే అని చెబుతూ..వారి ఫ్యాన్స్ ఓట్లు దక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వారి ఓట్లు పవన్కు పడతాయా? అంటే కష్టమే. ఇప్పటికే హీరోల ఫ్యాన్స్ పార్టీల వారీగా ఉన్నారు. మెగా ఫ్యాన్స్ ఎక్కువ శాతం జనసేనకు మద్దతు ఇవ్వవచ్చు. అటు నందమూరి ఫ్యాన్స్ టిడిపి వైపు ఉన్నారు. ఇక వైసీపీకి సైతం మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్ధతు ఎక్కువే. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా వైసీపీకి కొంత ఉంది. ఇలా ఎవరికి వారు పార్టీల వారీగా ఉన్నప్పుడు వన్ సైడ్ గా హీరోల ఫ్యాన్స్ ఓట్లు జనసేనకు దక్కడం కష్టమే.