రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏ పార్టీ ఎవరితో కలిసి పోటీ చేస్తుందో? ఏ పార్టీ, ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తే విజయం సాధిస్తుందో అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన టిడిపి పొత్తు ఉంటుందని, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళతామని బహిరంగంగానే ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ టిడిపి కంటే ముందు బిజెపితో పొత్తులో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిని అంటున్నారు. ఇప్పుడు బిజెపితో కూడా పొత్తులో ఉంటారా లేక టిడిపి తో మాత్రమే పొత్తులో ఉండి ఎన్నికలకు వెళ్తారా అనేది చర్చనీయాంసంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ను విభజించి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో నామరూపాలు లేకుండా పోయిందని చెప్పవచ్చు. ఎన్నికల విభజన హామీలు నెరవేర్చకుండా ఆంధ్ర ప్రజలలో బిజెపి వ్యతిరేకత మూటగట్టుకుంది. మైనార్టీ వర్గాల్లో కూడా బిజెపి అంటే పూర్తి వ్యతిరేకత ఉంది. అంతేకాకుండా ఈ నాలుగున్నరేళ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ధరలు పెరుగుదలతో ప్రజలంతా సతమతమవుతున్నారు. బిజెపి, వైసిపి పన్నులతో ప్రజలందరూ ఈ రెండు పార్టీలపై వ్యతిరేకతతో ఉన్నారని చెప్పవచ్చు.
ఆత్మసాక్షి సర్వే నివేదిక ప్రకారం బీజేపీతో పొత్తుంటే టిడిపి జనసేన కూటమికి నష్టమని చెబుతోంది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో కేసులతో టిడిపి ఖాళీ లేకుండా ఉంటే, వైసిపి మాత్రం ఏదొక జిమ్మిక్కు చేసి ప్రజలని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తుంది.
ఇలాంటి సమయంలో టిడిపి-జనసేన..బిజేపిని కలుపుకోవాలా? లేక కమ్యూనిస్టులని కలుపుకోవాలా? అనే అంశాన్ని త్వరగా తేల్చుకోవాలి. వామపక్షాలు, టిడిపి-జనసేనతో పొత్తుకు సుముఖంగానే ఉన్నాయి. టిడిపి వారు గాని, పవన్ గాని వామపక్ష నేతలు గాని ఇద్దరూ ఒక అడుగు ముందుకు వేస్తే వీరిద్దరి మధ్య పొత్తు ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నారు.
ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే ప్రకారం టిడిపి జనసేన పొత్తు ముందున్న వ్యూహాలు మూడు. బిజేపిని కలుపుకోవడం…కానీ బిజేపితో పొత్తు నష్టం కాబట్టి ఆ పార్టీని వదిలేయడమే బెటర్. ఇక కమ్యూనిస్టులతో కలవడమా లేక టిడిపి-జనసేన మాత్రమే ఎన్నికల బరిలో దిగడమా చేయాలి. దాదాపు టిడిపి-జనసేన మాత్రమే బరిలో ఉంటే బెటర్ అని ఆ రెండు పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. బిజేపితో పొత్తు వద్దంటే వద్దని టిడిపి వాళ్ళు అంటున్నారు. ఏ విషయమైన త్వరగా తేల్చుకుంటే బెటర్.