గత కొంతకాలం నుంచి టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల్లోకి లేరు. ఆయన కేవలం పార్టీ పరమైన కార్యక్రమాలు చూసుకుంటున్నారు. గత నెలలో కుప్పం పర్యటనకు వెళ్లారు.అంతే ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడా పర్యటించలేదు. కేవలం పార్టీ పరంగా నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులతో మాట్లాడటం..వారి పనితీరు తెలుసుకోవడం..ఇంకా పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచనలు చేయడం చేస్తున్నారు. అలాగే ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇంచార్జ్లని ఫిక్స్ చేస్తున్నారు.
ఇలా పార్టీ పరమైన పనుల్లోనే ఉన్నారు. అటు ఎలాగో లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజా స్పందన వస్తుంది. ఇక లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే..బాబు కూడా బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. బస్సు యాత్రతో నియోజకవర్గాల్లో పర్యటించి..ఆయా స్థానాల్లో పరిస్తితులని తెలుసుకుని,, అక్కడి సభలు ఏర్పాటు చేసి..అలాగే నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. రచ్చబండ పేరుతో కార్యక్రమాలు చేస్తూ..కార్యకర్తల ఇళ్లలోనే భోజనం చేయడం, నిద్ర చేయడం లాంటివి చేయాలని చూస్తున్నారు.
ఇక ఎన్నికల్లో గెలవాలంటే బూత్ స్థాయి కార్యకర్తలు చాలా ముఖ్యం. బూత్ స్థాయి క్లస్టర్లతో బాబు సమావేశాలు నిర్వహించనున్నారు. అధికార వైసీపీ అరాచకాలని ఎదురుకునేలా క్లస్టర్లకు సూచనలు ఇవ్వనున్నారు. ఇలా బాబు ప్రజల్లోకి వచ్చి..పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన పనిచేయనున్నారు. అయితే పొత్తుల అంశం ఇప్పుడే తేల్చే అవకాశాలు లేవు. ఎన్నికల సమయంలోనే ఆయన పొత్తుల అంశం గురించి మాట్లాడే ఛాన్స్ ఉంది. ఈ లోపు టిడిపి బలోపేతంపై ఫోకస్ పెట్టనున్నారు. అతి త్వరలోనే బాబు బస్సు యాత్ర మొదలు కానుంది.