రాష్ట్రంలో రాజకీయాలన్నీ గజిబిజి గందరగోళంగా ఉన్నాయి. వైసిపి అరాచక పాలనకు స్వస్తి చెప్పడానికి అంటూ జనసేన బీజేపీ కూటమి ఏర్పడింది. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలికతో వైసిపికి లాభం చేకూరిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించి రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తులో ఉంటారని ప్రకటించారు. సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు కూడా జరుగుతున్నాయి.
బిజెపి జనసేన పొత్తులో ఉన్నారు. ఇప్పుడు జనసేన బిజెపిని టిడిపి తో కలపాలని పవన్ కళ్యాణ్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్య కుమార్, పురందరేశ్వరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు వీరందరూ బిజెపి టిడిపి తో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఆశిస్తున్నారు. వీరందరూ టిడిపి జనసేన కూటమిలో బిజెపి కూడా కలవాలని 6 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే స్థానాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో బిజెపి సత్తా చాటాలని అనుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజంపేట, తిరుపతి, విశాఖ, నరసాపురం, నరసరావుపేట మొదలైన స్థానాలలో బిజెపి తరఫున పోటీ చేయాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు భావిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నట్లు ఒక ఫోటో బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇండియా కూటమితో పొత్తు పెట్టుకుంటారని వార్తలు కూడా వినిపించాయి. కానీ డీకే శివకుమార్ తో మాట్లాడినది సర్వసాధారణ విషయాలు తప్ప రాజకీయ అంశాలు కాదని, ఇండియా కూటమిలో చంద్రబాబు అంటే టిడిపి చేరే ప్రసక్తే లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తో బిజెపిని కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వైసిపి గెలవకూడదు అంటే కచ్చితంగా బిజెపి అండదండలు కూటమికి కావాలని భావిస్తున్నారు. మరి కేంద్రం అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో పొత్తులో భాగమవుతుందా? లేదా తన దారి తన అంటూ విడిగా పోటీ చేస్తుందా?? వేచి చూడాల్సిందే…