రానున్న ఎన్నికల్లో విజయం సాధించటం అనేది వైసిపికి, టిడిపికి కూడా ముఖ్యం. వైసిపి అధికారంలో ఉంది అధికార బలంతో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంది. కానీ టిడిపి మాత్రం ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాబోయే ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కన్నా, లోకేష్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవం.
యువ గళం తో లోకేష్ లో ఉన్న సత్తా ఏంటో ప్రజలకు నిరూపించారు. కానీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత అనూహ్య పరిణామాల మధ్య అర్ధాంతరంగా యువ గళం పాదయాత్రను విశాఖతో ముగించారు. విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు లోకేష్ యువ గళం పాదయాత్ర వెళ్ళలేదు. అక్కడ ఉన్న టిడిపి క్యాడర్ అసంతృప్తితో ఉన్నారని లోకేష్ శంఖారావం పేరిట బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు. రోజుకు మూడు నియోజకవర్గాలలో మొత్తం నియోజకవర్గాలన్నీ సందర్శించాలని నియోజకవర్గాలలో టిడిపిని బలోపేతం చేయాలని లోకేష్ కంకణం కట్టుకున్నారు. లోకేష్ స్పీచ్ తో ప్రజలందరూ ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు కొడుకుగా కన్నా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నాయకుడిగా ఎదిగారని చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను, యువతరాన్ని టిడిపి బరిలో దించి విజయం సాధించాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే టిడిపికి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో పాతవారిని పక్కనపెట్టి, యువతకు కొత్త వారికి స్థానాలు ఇవ్వడానికి లోకేష్ వ్యూహరచన చేస్తున్నారు. పలాస గౌతు లచ్చన్న కుటుంబం నుంచి వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని, పాతపట్నం కలమట వెంకటరమణ నుంచి ఎంజీఆర్ కు మార్చాలని, శ్రీకాకుళం గుండు లక్ష్మీదేవి కుటుంబం నుంచి వేరే అభ్యర్థిని బరిలోదించాలని, ఎచ్చెర్ల కళా వెంకట్రావును పక్కనపెట్టి యువతకు టికెట్ ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నారు.
40 శాతం యువతకు టికెట్లు ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పుతో టిడిపి విజయం సునాయాసం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి లోకేష్ పూరించిన సమర శంఖం విజయాన్ని అందిస్తుందా???