తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. నాయకులు ప్రజలను ఒంటరిగా కలుస్తున్నారు. ఇక, గురువారం పోలింగ్ ప్రారంభంకానుంది. డిసెంబరు 3న ఎవరు రాజు.. ఎవరు.. ప్రతిపక్షం అనేది తేలిపోతుంది. అయితే.. ఈ ఎన్నికల ఫలితం.. కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతుందా? కేవలం ఆ రాష్ట్ర వ్యక్తిగత అంశమా? అంటే.. కాదనే అంటున్నారు మేధావులు. నిజానికి వేర్వేరు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగినా.. తెలంగాణలో ఉన్నంత క్రేజ్ అక్కడ లేదు.
అక్కడ కేవలం రాజకీయ పార్టీల మధ్యే యుద్ధం జరిగింది. అది కూడా.. రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ల మధ్యే పోరు సాగింది. కానీ, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ(ఇప్పుడు జాతీయం) బీఆర్ ఎస్ అధికారంలో ఉండడం.. ఇదే అధికారం దక్కించుకునేందుకు రెండు జాతీయ పార్టీలు పోరు చేయడం గమనార్హం. ఇక, తెలంగాణ ఫలితం.. రెండు రూపాల్లో ఏపీపైనా.. దేశ రాజకీయాలపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు.
తెలంగాణలో గెలిచే పార్టీ ఏదైనా.. వచ్చే ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపతుందనేది ప్రధాన చర్చ. కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తే.. ఏపీలో మళ్లీ అధికార పార్టీకే ప్రజలు పట్టం గడతారనే చర్చ ఉండగా.. రెండు.. కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కితే.. ఏపీలో కాంగ్రెస్కు ప్రాణం పోసినట్టు అవుతుందనేది మరో ప్రధాన చర్చగా ఉంది. ఇక, బీజేపీ కనుక తెలంగాణలో పుంజుకుంటే.. ఆ ప్రభావంతో వచ్చే ఏపీ ఎన్నికల్లో కమల నాథులు మరింత ఫోకస్ పెంచి.. బలమైన పార్టీగా ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తారనే చర్చ ఉంది.
ఇక, జాతీయ స్థాయిలో చూసుకుంటే.. మోడీ మేనియాకు తెలంగాణ ఎన్నికలు దోహదపడతాయని అంటున్నారు. దాదాపు 5 చోట్ల రోడ్ షోలు.. ఆరు బహిరంగ సభలు.. మూడు చిన్నపాటి ప్రదర్శనలతో మోడీ ఐకాన్గా మారారు. ఈ నేపథ్యంలో రేపు బీజేపీ గెలిస్తే.. ఆయన వల్లే.. గెలిచామని చెప్పుకొంటారు. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పెంచుతుంది. ఇదేసమయంలో కేసీఆర్ గెలిస్తే.. ఆయన జాతీయ రాజకీయాలు పుంజుకుంటాయి. మొత్తంగా.. తెలంగాణ ఎన్నికల ఫలితంపై అనేక ప్రభావాలు ఉన్నాయని అంటున్నారు.,