నిత్యం వార్తల్లో నిలిచే నియోజకవర్గాలలో నంద్యాల ఒకటి. రాజకీయ,ఆర్థిక,సామాజిక చైతన్యం గల నియోజకవర్గాలలో నంద్యాల ప్రత్యేకమైనది. రాజకీయ చైతన్యం గురించి అయితే నంద్యాల మొదటి స్థానంలో ఉంటుంది. ఎలా అంటే 16 సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు స్వతంత్రులను గెలిపించిన ఘనత నంద్యాలది.ఈ నియోజకవర్గం నుండి గెలిచిన నీలం సంజీవరెడ్డి అంచలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయ్యారు. పి వి నరసింహారావు ప్రధానిగా చేశారు.
నంద్యాలలో శిల్పా కుటుంబానికి భూమా కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. వీరిద్దరికీ మధ్య ఎప్పుడు ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. వీరిరువురు ఎప్పుడూ ఒక పార్టీలో ఉండరు. కారణమేదైనా శిల్పాకుటుంబం టిడిపిలో ఉంటే భూమా కుటుంబ వైసీపీలో ఉంటుంది. భూమా కుటుంబం టిడిపిలో ఉంటే శిల్పా కుటుంబ వైసీపీలోకి మారుతుంది.ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. ఈయన శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు. 2014లో శిల్పా మోహన్ రెడ్డి టిడిపి తరఫున పోటీ చేస్తే, భూమా నాగిరెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత భూమా టిడిపిలోకి వచ్చారు. ఆయన మరణం తర్వాత నంద్యాల ఉపఎన్నికలో టిడిపి నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారు. కానీ 2019 వచ్చేసరికి టిడిపి తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తే,వైసిపి తరఫున శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పై ఇన్సైడ్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.దానికి ప్రతిస్పందనగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి భూ కబ్జాలు భూమా కుటుంబానికి మాత్రమే సాధ్యమని,అటువంటి పనులు అందరూ చేయలేరు అంటూ విమర్శలు చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ వైసిపి అభ్యర్థిగా శిల్పా కుటుంబానికి చెందిన వారే ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ నంద్యాల నుంచి టిడిపి అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ణయించలేకపోతున్నారు.టికెట్ ఆశించే వారిలో ముఖ్యులుగా భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, ఫరూక్..అతని కుమారుడు, కొత్తగా భూమా విఖ్యాత్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో కూడా తెలియని స్థితిలో టిడిపి అధిష్టానం ఉందని చెప్పవచ్చు.
అన్ని నియోజకవర్గాలలో గ్రామస్థాయిలో వైసిపికి పట్టు ఉండి పట్టణాలలో వ్యతిరేకత ఉంటే, నంద్యాలలో మాత్రం టౌన్ లో వైసీపీకి పట్టుంది, రూరల్ లో టిడిపికి పట్టింది.మరి నంద్యాలలో టిడిపి గెలుపు చాలా కష్టమని, అభ్యర్థిని నిర్ణయిస్తే తప్ప చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.టిడిపికి సరైన అభ్యర్థి లేకుంటే ఈసారి కూడా నంద్యాలలో వైసీపీ జెండానే ఎగురుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
టిడిపి అభ్యర్థి ఎవరో,వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరో?? నంద్యాలలో గెలిచే అభ్యర్థి ఎవరో??? వేచి చూడాల్సిందే…