ఒకవైపు ఫైర్బ్రాండ్ . మరో వైపు ప్రజానాయకుడు. వీరిద్దరి మధ్య జరగనున్న పోరు ఆసక్తిరేపుతోంది. ముందు కాదని.. తర్వా త.. తప్పదని బాధ్యతలు తీసుకున్న నాయకుడు ఒకవైపు. నియోజకవర్గాన్నే నమ్ముకుని.. ప్రజలనే నమ్ముకుని ఉన్న నాయ కుడు మరోవైపు. ఇదీ.. ఇతమిత్థంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన పరుచూరు నియోజకవర్గం పరిస్థితి. వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్.. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రజానేతగా పేరొందిన ఏలూరి సాంబశివరావులు వచ్చే ఎన్నికల్లో సై అంటే సై అంటున్నారు. మరి వీరిలో ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
ఇరువురు నేతలకు కూడా.. బలమైన కేడర్ ఉంది. స్థానికంగా ఏలూరికి మరింత కేడర్ ఉంది. ఆయనకు ప్రజల్లోనూ మంచి పేరుంది. గత రెండు ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోవడమే కాకుండా.. ప్రజల్లోనే ఉంటూ.. వారికి అనుకూలంగా వ్యవహ రిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. పార్టీపరంగా కూడా.. మంచి నేతగా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున సొంత సామాజిక వర్గం నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై పోటీ చేసిన ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ దఫా కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ ఆమంచి కృష్ణ మోహన్ తో తలపడుతున్నారు.
అయినప్పటికీ.. ఏలూరి కేడర్, ఆయనకు సంస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకు నికరంగానే ఉండడంతో ఏలూరి విజయం ఖాయ మని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. నకిలీ ఓట్లు చేర్చారని.. ఉన్న ఓట్లు తొలగించారని ఆయన చేసిన ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి. ఇక, ఆయనకు ఇటీవల కాలంలో కొన్ని స్థానిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అయినప్పటికీ.. వీటిని తట్టుకుని ముందుకు సాగేందుకు ఏలూరి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన డెయిరీ వ్యవహారం చిక్కుల్లో పడింది. అయినా.. ఏలూరి తనకుఉన్న ప్రజాబలంపైనే నమ్మకం పెట్టుకున్నారు.
ఇక, నియోజకవర్గంలో తొలిసారి అడుగు పెట్టిన ఆమంచి కృష్ణమోహన్ కూడా ఈ దఫా విజయం కోసం చమటోడ్చుతున్నారు. యువతను సమీకరిస్తున్నారు. అధికార వర్గాల సాయంతో ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గానికి కొత్తే అయినా.. పాత స్నేహితులను కలుపుకొని సభలు, సమావేశాలకుప్లాన్ చేస్తున్నారు. సో.. మొత్తంగా పరుచూరు నియోజకవర్గంలో ఇటు ఏలూరి, అటు ఆమంచి ఇద్దరూ కూడా సమ ఉజ్జీలుగా ముందుకు సాగుతున్నారు, అసలు నియోజకవర్గానికి రానన్న ఆమంచి.. ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. దీంతో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనేది ఒక విషయమైతే.. ఫైట్ మాత్రం మామూలుగా ఉండబోదని అంటున్నారు పరిశీలకులు.