గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ పావులు కదుపుతోంది. ఇంఛార్జిల మార్పు అంటూ దాదాపు అన్ని నియోజకవర్గాలలోను ఇంచార్జ్ లను మారుస్తూ వస్తున్నారు. ఇంఛార్జిల మార్పుతో విజయం సాధించవచ్చు అని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లున్నారు. కానీ ప్రభుత్వం పైనే వ్యతిరేకత ఉంటే, ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం చేస్తారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఇంచార్జిల మార్పు లో భాగంగా మార్కాపురం, గిద్దలూరు ఈ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు ఎవరి ఊహకు అందని విధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గిద్దలూరు నుంచి అన్న రాంబాబు గెలిచారు. మార్కాపురం నాగార్జున రెడ్డి నియోజకవర్గం. ఒకానొక దశలో గిద్దలూరు నుంచి అన్నా రాంబాబుకు టికెట్ ఇవ్వరని వార్తలు వినిపించాయి. అదే సమయంలో అన్నా రాంబాబు పార్టీ నుంచి బయటకు వెళతారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ అనూహ్యంగా గిద్దలూరు ప్రజలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని కోరుకుంటున్నారని, సర్వేలలో వచ్చిందని చెబుతూ వైసిపి అధినేత మార్కాపురం నుంచి నాగార్జున రెడ్డిని గిద్దలూరు కు మార్చారు. అన్నా రాంబాబును మార్కాపురం కి మార్చారు. అభ్యర్థి పై వ్యతిరేకత ఉంటే పక్కపక్క నియోజకవర్గంకి మారిస్తే వ్యతిరేకత పోతుందా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబును మార్కాపురంకు మార్చారు. కానీ మార్కాపురంలో రెడ్డి సామాజిక ఓటర్లే కీలకం కావడంతో అన్నా రాంబాబు గెలుపు కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నాగార్జున రెడ్డి పై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో గిద్దలూరులో రెడ్డి సామాజిక వర్గం వారే ఓటు వేసి గెలిపిస్తారన్న నమ్మకం లేదని సొంత పార్టీ వారే చెబుతుండడంతో అభ్యర్థులను మార్చినా ఫలితం శూన్యమా అని వైసిపి నేతలు తల పట్టుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.